గద్వాల: జిల్లాకేంద్రంలోని శ్రీసత్యసాయి పీజీ కళాశాలకు ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ హిస్టరీ కొత్త కోర్సులు మంజూరయ్యాయని కరస్పాండెంట్ బీచుపల్లి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేష్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ప్రస్తుత 2026–27 విద్యాసంవత్సరానికి ప్రవేశ అనుమతి లభించిందన్నారు. ప్రస్తుతం ఎంఎస్డబ్ల్యూ కోర్సుతోపాటు రెండు కొత్త కోర్సులు ఉన్నాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
క్రీడలతోనే ఆరోగ్యకరమైన జీవనశైలి : ఎస్పీ
ఎర్రవల్లి: క్రీడలతో పోలీస్ సిబ్బందికి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం స్థానిక పదో బెటాలియన్లో కమాండెంట్ జయరాజు ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన వార్షిక స్పోర్ట్స్ మీట్–2026 ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీతోపాటు అదనపు కలెక్టర్ నర్సింగ్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమాండెంట్తో కలిసి వివిధ పోటీలను ప్రారంభించి.. విజేతలుగా నిలిచిన అధికారులు, సిబ్బంది, క్రీడాకారులకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు– క్రీడలు వేర్వేరు కాదు రెండూ ఒక్కటే అన్నారు. క్రీడలతో కలిగే శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం పోలీస్ జీవితానికి అత్యంత అవసరం అన్నారు. క్రీడల వల్ల సిబ్బందికి క్రమశిక్షణ, సమన్వయం ఉంటాయన్నారు. ప్రతి పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలని సూచించారు. కమాండెంట్ జయరాజు మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగిన క్రీడల్లో సిబ్బంది క్రమశిక్షణతో పాల్గొని విజయవంతం చేసిన అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు, కుటుంబ సభ్యుల కోసం నిర్వహించిన పోటీల్లో లభించిన విశేష స్పందనపై సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు పార్థసారధిరెడ్డి, పాణి వెంకటరమణ, వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, ఆర్ఐలు రాజు, నర్సింహరాజు, ఆర్పీ సింగ్, శ్రీనివాస్, తిరుపతి, రాజేశం తదితరులు పాల్గొన్నారు.
పల్లీ @ రూ.7,399
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం 2,666 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.7,399, కనిష్టంగా రూ.2,119, సరాసరిగా రూ.5,500 ధరలు లభించాయి.
రేపు జాబ్మేళా
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈనెల 30న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మైత్రి ప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నాలుగు కంపెనీల్లో 100 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.


