గద్వాల: ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరుతడి పంటలను సాగుచేయాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. మంగళవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వీసీ నిర్వహించగా.. కలెక్టర్ గద్వాల మండలంలోని చెనుగోనిపల్లి రైతువేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శాస్త్రవేత్తల సూచనల మేరకు స్వల్పకాలిక, తక్కువ నీటి వినియోగంతో సాగయ్యే పంటలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నామన్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆయిల్పాం, పంటల వైవిద్దీకరణ ద్వారా ఆదర్శంగా నిలిచి.. ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్న ప్రగతిశీల రైతులను, రైతులకు నాణ్యమైన సేవలు అందిస్తూ వ్యవసాయభివృద్ధికి విశేష కృషిచేసిన వారిని సన్మానించారు. కార్యక్రమంలో డీఏవో వీరప్ప, తహసీల్దార్ హరికృష్ణ, రాజ్కుమార్, సర్పంచు పద్మ తదితరులు పాల్గొన్నారు.
పోషకాహార లోపం రానివ్వొద్దు
పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ రిజ్వాన్బాషాషేక్ అన్నారు. మండలంలోని చెనుగోనిపల్లిలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి.. పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, విద్యాబోధన తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో ఆయన ముచ్చటించారు. శిశుసంరక్షణ, ఆరోగ్యకరమైన అలవాట్లపై నిరంతరం అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి.. విద్యార్థుల హాజరు, విద్యాబోధన, మధ్యాహ్న భోజనం, యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామంలో సర్ ప్రక్రియను పరిశీలించారు.


