ధరూరు: ఈఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూచించారు. సోమవారం ధరూరు రైతువేదికలో ఏర్పాటుచేసిన విత్తన మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సంప్రదాయ పంటలకు బదులుగా ఉద్యాన పంటల సాగుతో మంచి లాభాలు పొందవచ్చన్నారు. వ్యవసాయ, హార్టికల్చర్ అధికారుల సూచనలు, సలహాలతో రైతులు మేలు రకం విత్తనాలను కొనుగోలు చేసి.. లాభాల బాటలో నడవాలని సూచించారు. ప్రస్తుతం ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదని.. తక్కువ నీటితో పండించే ఆరుతడి పంటలైన జొన్న, మొక్కజొన్న, మిరప, శనగ, సజ్జ, కంది, పెసర, మినుములు, నువ్వులు వంటి పంటల సాగుపై దృష్టిసారించాలని సూచించారు. ఉద్యాన పంటలకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీఏఓ వీరప్ప మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల్లో స్వల్పకాలిక ఆరుతడి పంటలతోనే మేలు చేకూరుతుందన్నారు. అనంతరం రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి రాజ్కుమార్, ఏఓ శ్రీలత, సర్పంచ్ డీఆర్ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, నాయకులు శ్రీనివాస్రెడ్డి, రాజశేఖర్, విజయ్, రాములు, శేఖర్, సంజీవ్ పాల్గొన్నారు.


