వనపర్తి రూరల్: పెబ్బేరు పట్టణ శివారులోని జూరాల కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటన బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబ్నగర్ చెందిన షకీల్ కారులో పెబ్బేరు మండలంలోని సూగూరుకు వస్తుండగా మార్గ మధ్యలో పెబ్బేరు శివారులోని జూరాల కాల్వ వద్ద బైక్ అడ్డు రావడంతో వాహనం అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. కారులో ఉన్న షకీల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారు వెనుక అద్దాలు పగులగొట్టి బయటకు రావడంతో ప్రమాదం తప్పింది.
బస్టాండ్లో
వృద్ధురాలు మృతి
మరికల్: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ధన్వాడకు చెందిన లలిత (65) భర్త ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి మరికల్లో యాచిస్తూ బస్టాండ్లోనే ఉండేది. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు.
హోటళ్లపై
అధికారుల దాడులు
తెలకపల్లి: పట్టణంలోని పలు హోటళ్లపై రెవెన్యూ, పోలిసులు దాడులు నిర్వహించారు. సిలిండర్ కొరత నేపథ్యంలో వినియోగదారులు సిలిండర్లు అందక అవస్థలు పడుతున్నారు. దీంతో హోటళ్లలో తనిఖీలు చేపట్టి అక్రమంగా వినియోగిస్తన్న గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. దాదాపు ఏడు డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకొని గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు. డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లలో వాడితే చర్యలు తీసుకుంటామన్నారు. దాడుల్లో నాయబ్ తహసిల్దార్ పట్టాబి, ఎస్ఐ నరేష్, ఆర్ఐ రామస్వామి, జీపీఓలు పాల్గొన్నారు.
ఆలయానికి
బంగారం విరాళం
కేటీదొడ్డి: మండలంలోని వెంకటాపురం గ్రామంలోని వెలసిన శ్రీపాగుంట లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయానికి కర్ణాటక రాష్ట్రం కురుతిప్లకు చెందిన నారాయణరెడ్డి, దివ్యవాణి దంపతులు బుధవారం తులం బంగారు ఉంగారం విరాళం అందజేశారు. ఈ సందర్భంగా దాతలను శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


