భూపాలపల్లి: పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం సాధ్యమని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని గ్రంథాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాలు, పాఠకులకు కల్పిస్తున్న సౌకర్యాలు, డిజిటల్ లైబ్రరీ ఏర్పాట్లు, మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో కలెక్టర్ మాట్లాడారు. అభ్యర్థులకు అవసరమైన కాంపిటేటివ్ పుస్తకాలు అందుబాటులో ఉంచడంతో పాటు కంప్యూటర్స్ సదుపాయం, ఆర్ఓ వాటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రంథాలయ ప్రాంగణంలో కలెక్టర్ మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గడువులోగా పూర్తి చేయాలి..
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అనామలిస్, నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసుల జారీ, విచారణ అంశాలను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో సర్ ప్రక్రియలో భాగంగా అనామలిస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు జారీ తదితర అంశాలపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు, బూత్ సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు చేశారు. 30 రోజుల్లో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ప్రక్రియను పూర్తిచేసేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి..
చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయపు కాన్ఫరెన్స్ హాల్లో పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనుల్లో జాప్యం లేకుండా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో వేగవంతం చేయాలని సూచించారు. కాలువల నిర్మాణ పనులతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని, పనుల అమలులో ఎదురవుతున్న సమస్యలను శాఖల మధ్య సమన్వయంతో పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం ఆర్డీఓ రవీందర్, తహసీల్దార్లు, ఇరిగేషన్ ఇంజినీర్లు, మెగా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


