మొగుళ్లపల్లి: మహిళల ఆర్థిక సాధికారతకు స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. మండల పరిధిలోని రంగాపురం, ఇస్సిపేట, పాత ఇస్సిపేట, ఎల్లారెడ్డిపల్లి, కోర్కిశాల, గణేశ్పల్లి గ్రామాల్లో మహిళా సంఘాలకు సంబంధించిన వీవో భవనాల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అలాగే మొగుళ్లపల్లి, రంగాపురం, ఆకినపల్లి గ్రామాల్లోని రైతువేదికల్లో స్మార్ట్ రేషన్ కార్డులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణారావు మాట్లాడుతూ వీవో భవనాల నిర్మాణంతో మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధి, రైతుల సంక్షేమం, పేదల జీవన ప్రమాణాల మెరుగుదలకు కట్టుబడి పనిచేస్తోందని వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ సురేందర్, ఎంపీఓ సుభాశ్చంద్రబోస్, ఏపీఎం రమాదేవి, చిట్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండీ రఫీ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు


