● గుండెపోటుతో సింగరేణి కార్మికుడి మృతి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే–1వ గనిలో గురువారం విషాదం చోటుచేసుకుంది. బుధవారం నైట్షిఫ్ట్లో విధులు నిర్వహిస్తూ కోల్కట్టర్ గోపాల్ గోపి (39) అస్వస్థతకు గురై మృతి చెందారు. ఛాతిలో నొప్పి, చెమటలు పట్టడంతో సహచరులు ఆయనను గని నుంచి బయటకు తరలించగా, ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు.
ఆస్పత్రి వద్ద సంఘాల ఆందోళన
గోపి మృతిపై ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్, టీబీజీకేఎస్ నాయకులు ఏరియా ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. అస్వస్థతకు గురైన గోపిని స్ట్రెచర్కు బదులుగా మ్యాన్రైడింగ్లో కూర్చోబెట్టి పైకి తీసుకొచ్చి, అక్కడి నుంచి అంబులెన్స్ వరకు నడిపించారని సంఘాల నాయకులు ఆరోపించారు. అత్యవసర పరిస్థితుల్లో కార్మికులను సురక్షితంగా తరలించేందుకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక అంబులెన్స్, ఆక్సిజన్, ప్రథమ చికిత్స పరికరాలు, అత్యవసర మందులు, శిక్షణ పొందిన వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని కోరారు. యాజమాన్యం తరఫున ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యామ్సుందర్ సంఘాల నాయకులతో చర్చించి, గోపి కుటుంబానికి నిబంధనల ప్రకారం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని, అత్యవసర వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆస్పత్రికి చేరుకుని గోపి మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గనుల్లో ప్రమాదాలు లేదా అకస్మాత్తుగా అనారోగ్య పరిస్థితులు తలెత్తినప్పుడు తక్షణ వైద్యం అందేలా ప్రత్యేక అంబులెన్స్, వైద్యుడు, సాంకేతిక సిబ్బంది, ప్రథమ చికిత్స పరికరాలు అందుబాటులో ఉంచాలని సింగరేణి అధికారులను కోరారు.
31న అష్టతీర్థాలకు టెండర్
కాళేశ్వరం: కాళేశ్వరంలో సరస్వతీఘాటు ఎగువ నుంచి అంతర్రాష్ట్ర వంతెన వరకు అష్టతీర్థాలు నిర్మించడానికి ఇరిగేషన్శాఖ ఆధ్వర్యంలో రూ.60 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈనెల 8న, 14న టెండర్లు నిర్వహించాల్సి ఉండగా..టెక్నికల్ సమస్యలతో వాయిదాపడింది. మళ్లీ ఈనెల 31న టెండర్ నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ నిర్మాణాలు వచ్చే ఏడాది జూన్ 26నుంచి జూలై 7వరకు నిర్వహించే గో దావరి పుష్కరాల వరకు పూర్తి కావాల్సి ఉంది.


