భూపాలపల్లి: పింఛన్ల మంజూరుకు ఆగస్టు 31లోగా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో చేయూత సామాజిక భద్రత పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల అంశంపై డీఆర్డీఓ బాలకృష్ణ, డీపీఎం రవితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పింఛన్ల పథకంలో భాగంగా అర్హులైన కొత్త లబ్ధిదారులకు మంజూరు కోసం దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, కల్లు గీత, చేనేత కార్మికులు, బోదకాలు, తలసేమియా, సికిల్సెల్, హిమోఫీలియా వంటి రక్త రుగ్మతలతో బాధపడుతున్న వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల గ్రామసభలు, ప్రజావాణి కార్యక్రమాల్లో ఇప్పటికే అవసరమైన ఆధారాలతో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు. అర్హులైన వారు అవసరమైన ధృవీకరణ పత్రాలతో తమ దరఖాస్తులను ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయంలో సమర్పించి తప్పనిసరిగా రసీదు పొందాలన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


