భూపాలపల్లి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహిస్తున్న సభలతో ప్రజాధనం వృథా కావడమే తప్ప, ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. రేవంత్రెడ్డి ‘యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి’ అని, ప్రజల ఆశీస్సులతో కాకుండా పరిస్థితుల వలన ఆయన సీఎం పదవికి చేరుకున్నారన్నారు. అందరూ ఆయనలా తొక్కుకుంటూ ఎదగలేరని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందుతుందని, కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్రెడ్డికి డిపాజిట్ దక్కితే చాలన్నారు. తెలంగాణలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరమని ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. ప్రస్తుత ప్రభుత్వం విచారణల పేరుతో ఆలస్యం చేసి ప్రాజెక్ట్ పునరుద్ధరణ చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, నాయకులు మేకల సంపత్కుమార్, కళ్లెపు రఘుపతిరావు, జక్కం రవి, బుర్ర సదానందం, వార్డు కౌన్సిలర్ బోగం నరేందర్ పాల్గొన్నారు.
రేవంత్రెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి


