పకడ్బందీ ఏర్పాట్లు
25నుంచి ఇంటర్ పరీక్షలు
● జిల్లాలో 8 పరీక్ష కేంద్రాలు
● 3,778వేల మంది విద్యార్థులు
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 12 మండలాలు ఉండగా 8 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసి కావాల్సిన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. 34 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు ఉండగా.. ప్రథమ సంవత్సరంలో 1,842, ద్వితీయ సంవత్సరంలో 1,936 మొత్తంగా 3,778మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో 5 ప్రభుత్వ జూనియర్, 6 మోడల్ జూనియర్ కళాశాలలు, 4 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, 2 ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్, 10 కేజీబీవీ, 2 సోషల్ వెల్ఫేర్, 1 మైనారిటీ, 4 బీసీ వెల్ఫేర్ కళాశాలలు ఉన్నాయి.
8 పరీక్ష కేంద్రాలు
జిల్లాలో 34 జూనియర్ కళాశాలలు ఉండగా.. ఎనిమిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 25న ప్రథమ సంవత్సరం పరీక్షలు, 26న ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. విద్యార్థులు తమ హాల్టికెట్లను ఆన్లైన్ ద్వారా తీసుకొని నేరుగా పరీక్ష సెంటర్కు రావచ్చు. విద్యార్థులకు హాల్ టికెట్, పెన్నులు, ప్యాడ్ మినహాయించి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్ అనుమతి లేదు.
సిబ్బంది నియామకం
పరీక్షల నిర్వహణ కోసం దాదాపు 90మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 8 పరీక్ష కేంద్రాల్లో 16 మంది సీఎస్, డీఓలు, మాస్కాపియింగ్, మాల్ప్రాక్టీస్ జరగకుండా చూసేందుకు ప్లయింగ్ స్క్వాడ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద 143 సెక్షన్ విధించనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద గొడవలు, జనసందోహం లేకుండా చూసేందుకు పోలీసు సిబ్బందిని నియమించనున్నారు.
ప్రత్యేక బస్సులు ఏర్పాటు..
పరీక్ష సమయానికి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు ఉదయం, మధ్యాహ్నం ఐదు రూట్లలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. బొర్లగుడెం, ఆజాంనగర్ నుంచి భూపాలపల్లికి, గంగారం నుంచి తాడిచర్ల వరకు, కష్ణారావుపేట, సర్వాయిపేట నుంచి మహదేవపూర్ వరకు వేర్వేరుగా, దామెరకుంట నుంచి కాటారం వరకు బస్సు సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ అఽధికారులు సర్వీసులను సిద్ధం చేసినట్లు తెలిపారు.
పకడ్బందీ చర్యలు..
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్షల్లో మాస్ కాపియింగ్, మాల్ప్రాక్టీస్ను ప్రోత్సహించవద్దని సీఎస్, డీఓ, సిబ్బందికి ఆదేశాలు జారీచేశాం. విద్యార్థులు పరీక్ష నిబంధనల ప్రకారం హాజరుకావాలి. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షకు హాజరుకావాలి. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం ఉత్తమం.
– వెంకన్న, ఇంటర్ విద్య జిల్లా నోడల్ అధికారి
పరీక్ష కేంద్రాలివే..
భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల
తేజస్విని గాంధీ జూనియర్ కళాశాల భూపాలపల్లి
చిట్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల
చిట్యాల మోడల్ జూనియర్ కళాశాల
కాటారం ప్రభుత్వ జూనియర్ కళాశాల
కాటారం మోడల్ జూనియర్ కళాశాల
మహదేవపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల
మల్హర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల
పకడ్బందీ ఏర్పాట్లు


