‘ధన్ధాన్య’ అమలుపై సమీక్ష
జనగామ: ప్రధానమంత్రి ధన్ధాన్య యోజన (పీఎండీడీకేవై) పురోగతిపై బుధవారం కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి చిన్మయ్ పి.గోట్మారే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలు నుంచి ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి.పింకేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ స్కీంలో రూపొందించిన 6 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక అమలు పురోగతి, మండలాల వారీగా లక్ష్య సాధన, డ్యాష్బోర్డ్లో నమోదైన భౌతిక, ఆర్థిక పురోగతిపై ఆరా తీశారు. పంటల ఉత్పాదకత పెంపు, సుస్థిర వ్యవసాయ పద్ధతుల ప్రోత్సాహం, రైతులకు సులభతర రుణ సదుపాయాలు, ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తరణ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధి, సమగ్ర నీటి యాజమాన్యం, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత అమలు వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ మాట్లాడుతూ.. పీఎండీడీకేవే అమలులో జిల్లాను దేశంలో ఆదర్శంగా నిలబెట్టేలా అన్ని శాఖలు సమన్వయంతో, సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. వీసీలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్, సహకార, భూగర్భ జలాలు, పౌర సరఫరాలు, నీటిపారుదల, నాబార్డు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


