బకాయిల వేట!
ఆస్తి పన్ను వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్
జనగామ: ఆస్తి పన్ను (ప్రాపర్టీ ట్యాక్స్) వసూళ్లను వేగవంతం చేసేందుకు మున్సిపల్ శాఖ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారు. జనగామ మున్సిపల్ పరిధిలో 15,818 అసెస్మెంట్లు ఉండగా, ప్రస్తుత, పాత బకాయిలను కలుపుకుని రూ.6.10 కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్ రావాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.2.86 కోట్లు మాత్రమే వసూలు కాగా, ఇంకా రూ.3.23 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం వసూళ్ల శాతం 47.01శాతంగా నమోదైంది.
2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ రూ.3.70 కోట్లు రావాల్సి ఉండగా, దీనిపై రూ.18.61 కోట్లు పెనాల్టీ బకాయి ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న రూ.1.35కోట్ల పన్నులపై రూ.85.36 లక్షల పెనాల్టీ రావాల్సి ఉంది. ప్రస్తుత ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి డిమాండ్లో ఇప్పటి వరకు రూ.2.36 కోట్లు వసూలు కాగా, దీనికి సంబంధించిన పెనాల్టీ రూ.7లక్షలు వసూలు చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పాత బకాయిల్లో రూ.32.68 లక్షలను వసూలు చేయగా, వాటి రూ.10.67 లక్షల పెనాల్టీ రికవరీ చేశారు. ఇంకా కరెంటు డిమాండ్లో రూ.1.34 కోట్లు రావాల్సి ఉండగా, పెనాల్టీగా రూ.11 లక్షలు రావాల్సి ఉంది. పాత బకాయిల్లో రూ.1.02 కోట్లు పెండింగ్ ఉండగా, వాటిపై రూ.74.69 లక్షల పెనాల్టీలు పెండింగ్లో ఉన్నాయి.
వచ్చే నెల 31 వరకు వసూళ్లు 100శాతం ప్రాపర్టీ ట్యాక్స్ పూర్తి చేయాలని లక్ష్యంగా బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు రోజూ గృహాలు, వ్యాపార సంస్థలకు వెళ్లి ట్యాక్స్ సేకరణ చేస్తున్నారు. మొండిబకాయిదారుల వల్ల కొంత సమస్యలు వచ్చినప్పటికీ, కమిషనర్ మహేశ్వర్రెడ్డి పర్యవేక్షణలో వసూళ్ల ప్రక్రియ సాగుతోంది. రోజువారీ కలెక్షన్లపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ స్వయంగా వివరాలు సేకరిస్తున్నారు.
వచ్చేనెల 31 నాటికి 100 శాతం లక్ష్యం
పాతవి, కొత్తవి కలుపుకుని రూ.6.10కోట్లు
ప్రస్తుతం 47 శాతం వసూళ్లు
ఇంటింటికీ వెళ్తున్న పురపాలక సిబ్బంది


