ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
కౌంటింగ్ కేంద్రం పరిశీలన
జనగామ రూరల్: మున్నిపల్ ఎన్నికలను అధికారులు సమర్థవంతంగా, పారదర్శకంగా, చట్టబద్ధంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, ట్రైనింగ్ నోడల్ అధికారి మాధురి షా సూచించారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలపై పీఓ, ఏపీఓలకు కలెక్టరేట్లో సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియలో పాటించాల్సిన నియమాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్లకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, శాంతియుత వాతావరణంలో పోలింగ్ నిర్వహణ, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారు వివరించారు. కౌంటింగ్ విధానం, వివాదాస్పద బ్యాలెట్ పేపర్ల పరిశీలన, రీకౌంటింగ్కు సంబంధించిన నిబంధనలు, ఫలితాల ప్రకటన వంటి పలు అంశాలపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు.
ఓట్ల లెక్కింపు కేంద్రాలు
జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ 13వ తేదీన ఉదయం 8.00గంటలకు ప్రారంభమవుతుంది. హైదరాబాద్ రోడ్డులోని ఏకశిల బీఎడ్ కళాశాలలో జనగామ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు ఉంటుంది. అలాగే, పల్లగుట్టలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు జరగనుంది.
స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ శివారు పల్లగుట్ట క్రాస్రోడ్డు సమీపంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ హాల్, టేబుళ్ల అమరిక, భద్రతా చర్యలు, సీసీటీవీ పర్యవేక్షణ, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, తాగునీరు, మూత్రశాలల సదుపాయాలు, విద్యుత్ సరఫరా తదితర వసతులపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, చట్టబద్ధంగా జరగాలని ఆదేశించారు. మొత్తం ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ అత్యంత కీలకమని గుర్తుచేశారు. ఆయన వెంట ఆర్డీఓ డీఎస్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఉన్నారు.
అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్


