● పనికిమాలిన రాజకీయాలు చేయొద్దు : ఎంపీ ధర్మపురి అర్వింద్ ● సంస్కారం తెలియని ఎంపీ : ఎమ్మెల్యే సంజయ్కుమార్
రాయికల్: మండలం ధర్మాజీపేటలో ఆయుష్మాన్ భారత్ ఆస్పత్రి ప్రారంభం ఎంపీ ధర్మపురి అర్వింద్ వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్గా మారింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఎంపీ, ఎమ్మెల్యే కలిసి ఆస్పత్రిని ప్రారంభించాల్సి ఉంది. అయితే ఎంపీ రెండు గంటలపాటు ఆలస్యంగా చేరుకున్నారు. అంతసేపు ఎమ్మెల్యే నాయకులతో కలిసి వేచిచూశారు. ఎంపీ వచ్చాక ఆస్పత్రిని ప్రారంభించారు. అదే సమయంలో అక్కడున్న బీజేపీ కార్యకర్తలు జైశ్రీరామ్, భారత్మాతాకీ జై, జై ధర్మపురి అంటూ నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు జైకాంగ్రెస్, జై సంజయన్న అంటూ నినదించారు. కొద్దిసేపటికి సభ ప్రాంగణానికి వచ్చిన ఎంపీ మూడు నిమిషాల్లో ప్రసంగాన్ని ముగించి వెళ్లిపోయారు.
పనికిమాలిన రాజకీయాలు చేయొద్దు
కేంద్రం నిధులతోనే ఆస్పత్రిని ప్రారంభించామని, తన వద్ద పనికిమాలిన రాజకీయాలు చేయొద్దని, ఫ్లెక్సీలకయ్యే ఖర్చును ఆస్పత్రి అభివృద్ధికి కేటాయించాలని ఎంపీ అర్వింద్ అన్నారు. ఎక్కడా లేని విచిత్ర రాజకీయం జగిత్యాల నియోజకవర్గంలో ఉందని, ఏ పార్టీ నాయకుడు ఎందులో ఉంటారో ఎవరికీ తెలియదని అన్నారు.
అర్వింద్ వ్యాఖ్యలు సరికాదు
ఎంపీ రెండు గంటలు ఆలస్యంగా వచ్చినా వేచి చూశానని, తీరా వచ్చాక సభ మర్యాద లేకుండా ఇష్టానుసారంగా వ్యాఖ్యానించడం సరికాదని ఎమ్మెల్యే అన్నారు. బీజేపీ నాయకులు నినాదాలు చేస్తే తమ కార్యకర్తలూ నినాదాలు ఇచ్చారని తెలిపారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజాసేవే ముఖ్యమని, ఎంపీ అర్వింధ్ కేంద్రం నిధులతో ఎన్ని ఆస్పత్రులు ప్రారంభించారో చెప్పాలని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఇప్పటివరకు 14 పల్లె దవాఖానాలు మంజూరు చేయించానని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ దినేశ్, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, సర్పంచ్ గంగారెడ్డి, డీఎంహెచ్వో సుజాత, ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్ నాగార్జున, ఎంపీవో సుష్మ పాల్గొన్నారు.


