వీఎల్‌టీ స్థలం.. కమిషనర్‌కు గండం | - | Sakshi
Sakshi News home page

వీఎల్‌టీ స్థలం.. కమిషనర్‌కు గండం

May 7 2026 8:02 AM | Updated on May 7 2026 8:02 AM

కోరుట్ల బురుజు స్థలాలకు అడ్డగోలుగా వీఎల్‌టీలు కమిషనర్‌ పాత్ర ఉండడంతో బదిలీ వేటు నేడు విచారణ చేపట్టనున్న ఆర్డీవో

కోరుట్ల: ఏదైనా స్థలానికి వేకెంట్‌ ల్యాండ్‌ టాక్స్‌ (వీఎల్‌టీ) వేయాలంటే ఆ స్థలానికి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ తప్పకుండా ఉండాలి. స్థలం చుట్టూ హద్దులు చూపే రీతిలో కనీసం బేస్‌మెంట్‌.. అర్జీ దారుడిదే అని ధ్రువీకరించేందుకు చిన్నపాటి షెడ్డు చూపాలి. అన్నీ పరిశీలించాక.. నియమిత స్థలానికి మాత్రమే వీఎల్‌టీ కేటాయించాల్సి ఉంటుంది. కా నీ.. ఇవన్నీ పక్కనపెట్టి.. ఎలాంటి ధ్రువీకరణ లేకు న్నా.. ఓ వీలునామా ఆధారంగా హద్దులు లేని స్థలానికి ఆనుకుని గతంలో ఎప్పుడో ఇళ్లు ఉన్నాయ ని చెప్పి వీఎల్‌టీ నంబర్లు కేటాయించడం కోరుట్ల పట్టణంలో వివాదాస్పదంగా మారింది. ఈ వీఎల్‌ టీ కేటాయింపు వ్యవహారంలో మూడు రోజుల క్రితం బదిలీ అయిన మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌ లెక్కలేని ఆరోపణలు ఎదుర్కొన్నారు. చివరికి కోరుట్ల నుంచి అర్ధాంతరంగా బదిలీపై వెళ్లారు.

ఏమిటీ వివాదం..

కోరుట్ల పట్టణంలో చాళుక్యుల కాలం నాటి చారిత్రక కోటబురుజులు ఆనాటి ఖ్యాతికి ఆనవాళ్లుగా మిగిలాయి. అనంతరం కాలంలో సదరు కోట బురుజులకు ఆనుకుని ఉన్న సుమారు 14 వేల చదరపు గజాల స్థలం వారసత్వ సంపదగా నిర్ధారించి పురావస్తు శాఖ పరిధిలోకి తెచ్చారు. వందల ఏళ్లుగా ఆ బురుజులను ఆనుకుని ఉన్న స్థలంలో సుమారు 200 మీటర్ల మేర ఎలాంటి కట్టడాలకూ అనుమతి ఇవ్వలేదు. సదరు స్థలం తమకు వారసత్వంగా చెందుతుందని, ఆ స్థలంలో తమకు ఇదివరకు గడీలు, ఇళ్లు ఉండేవని వాటిని అమ్మేందుకు కొంతమంది ప్రయత్నాలు సాగించారు. వాటిలో కొంతభాగం అమ్మకాలు కూడా జరిగాయి. పురావస్తు శాఖ ఉత్తర్వులు అమల్లో ఉన్న క్రమంలో మున్సిపల్‌ నుంచి నిర్మాణాలకు అనుమతి రాలేదు. సుమారు 12 ఏళ్ల క్రితం గడి బురుజుల స్థలంలో అమ్మకాలు జరిగాయి. ఆ అమ్మకాలపై అప్పుడే వివాదం మొదలైంది.

హైకోర్టుకు వివాదం

కోరుట్ల కోట బురుజుల స్థలం వారసత్వ సంపద అని పేర్కొంటూ అప్పటి కౌన్సిలర్‌ ఒకరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో పిటిషనర్‌ సరైన ఆధారాలు సమర్పించకపోవడం.. పురా వస్తు, రెవెన్యూ అధికార యంత్రాంగం సదరు స్థలా న్ని తమదిగా చూపడంలో ఉదాసీనంగా వ్యవహరించడంతో పరిస్థితి చేజారింది. ఎనిమిది నెలల క్రితం సదరు స్థలంలో కోట బురుజులు మినహా మిగిలిన స్థలం అంతా వారసులకే చెందుతుందని హెరిటేజ్‌ డిపార్ట్‌మెంట్‌ ఉత్తర్వులు జారీ చేసి వారసులకు ఆస్తిపై హక్కును ధ్రువీకరించింది. బురుజ ల నిర్మాణం ఉన్న పరిసరాల్లో 15 ఫీట్లు మినహా యించి మిగిలిన స్థలం అంతా వారసులదే అని ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సదరు ఆస్తి వారసులు కోట బురుజుల ఆబాదిలో ఉన్న ఆ స్థలం అమ్మకాలకు యత్నించారు. సదరు స్థలం రిజిస్ట్రేషన్‌ కోసం అమ్మకానికి వీఎల్‌టీ వేసుకోవడం తప్పనిసరి అయింది. గతంలో ఉన్న తమ గడీలు, ఇళ్లకు సంబంధించిన మూడు ఇంటి నంబర్లను ఆసరాగా చేసుకుని కోరుట్ల మున్సిపల్‌ అధికారులు వేలాది గజాల స్థలానికి వీఎల్‌టీ నంబర్లు వేశారు. ఈ వీఎ ల్‌టీల కేటాయింపునకు ఎలాంటి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌లు లేకపోవడం వివాదాస్పదంగా మారింది. ఈ స్థలం ఖాళీగా ఉన్న సమయంలో మహిషాసుర మర్ధన కార్యక్రమానికి వేదికగా మారడం, దగ్గరలోనే ఉన్న కూరగాయల మార్కెట్‌ రోడ్డుపై ఉండటం, అందుబాటులో పార్కులు లేకపోవడంతో కో ట బురుజుల స్థలాన్ని ప్రజోపయోగానికి వినియోగించాలన్న డిమాండ్‌ వచ్చింది. ఈ డిమాండ్‌తో అఖిలపక్షాలు సుమారు మూడు నెలలుగా వివిధ రకాల నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి.

లెక్కలేని ఫిర్యాదులు.. నేడు విచారణ

అఖిలపక్షాలు, స్థానికులు కొందరు కొందరు గడి స్థలంలో అక్రమంగా వేసిన వీఎల్‌టీలు రద్దు చేయాలని ఉద్యమాలు చేపట్టారు. బీజేపీ కౌన్సిలర్లు కలెక్టర్‌, ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గడీ స్థలాలకు వీఎల్‌టీలు ఎలా వేశారన్న అంశంపై ఆర్డీవో జీవాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం విచారణకు రంగం సిద్ధమైంది. తప్పుడు రీతిలో వేసిన వీఎల్‌టీల విషయంలో అధికార యంత్రాంగం విచారణ ఎలాంటి ఫలితం ఇస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. తప్పుడు వీఎల్‌టీలకు కారణమైన బదిలీ అయిన మున్సిపల్‌ కమిషనర్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న అంశం చర్చనీయాంశంగా మారింది.

గడీ స్థలం ప్రస్తుతం పట్టణ మధ్యభాగంలో ఇళ్ల మధ్య ఉంది. దీంతో సదరు స్థలం విలువ గజానికి రూ.15వేల వరకు పలుకుతోంది. దీనిపై స్థానిక భూమాఫియా కన్నేసి తక్కువ ధరకు చేజిక్కించుకునేందుకు యత్నాలు చేశాయి. ఈ క్రమంలో మళ్లీ గడి స్థలాల భూమిలో కొనుగోళ్లు.. నగదు లావాదేవీలు సాగినట్లు సమాచారం. ఎవరికి వారు అందినంత మేర దండుకునే యత్నాలకు శ్రీకారం చుట్టడం వివాదానికి దారి తీసింది.

మున్సిపల్‌ అధికారులు ఈ విషయంలో చేతివాటం చూపారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి.

గడి స్థలంపై

భూ మాఫియా..

Advertisement
 
Advertisement
Advertisement