పరామర్శలే ప్రాప్తం!
జగిత్యాలఅగ్రికల్చర్: ప్రతీ ఏడాది జిల్లాలోని రైతులు అధిక వర్షాలు, వడగండ్లు, బలమైన ఈదురుగా లులు వంటి ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు తమ కళ్ల ముందే ధ్వంసమై.. కనీసం పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. అన్నదాతకు అండగా ఉంటామని చెప్పుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. పంట నష్టపోయిన ప్రతిసారీ అధికారులు నివేదికలు రూపొందించడం.. నష్ట పరిహారమిస్తామంటూ ప్రభుత్వం వాగ్దానాలకే పరిమితమవుతున్నారు. దీంతో పంట నష్టపోయిన రైతులు తమ ఖర్మ అనుకుంటూ దేవుడి మీదే భారం వేస్తున్నారు.
లేనిపోని నిబంధనలు
పంటలకు నష్టం జరిగినప్పుడు ప్రభుత్వాలు పరిహారమందించాలి. పరిహారమందించే ప్రయత్నాలను ప్రభుత్వాలు ఎప్పుడో మర్చిపోయాయి. దీనికి తోడు పంట నష్ట పరిహారం విషయంలో ప్రభుత్వం లేనిపోని నిబంధనలు పెట్టింది. దీంతో 33 శాతానికి పైగా పంట నష్ట పరిహారం జరిగితేనే వ్యవసాయాధికారులు నివేదికలు తయారు చేసే పరిస్థితి నెలకొంది. ఒకవేళ నివేదికలను అధికారులు ప్రభుత్వ నిబంధనల మేరకు పంపినా.. పరిహారమందడం గగనంగానే మారింది. ప్రతీ ఏడాది అధిక వర్షాలతో వేలాది ఎకరాల పంట దెబ్బతిన్నా.. అధికారులు నివేదికలకే పరిమితమయ్యారు. గతేడాది జిల్లాలో వడగండ్ల వానతో యాసంగిలో పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారమిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఏడాది కావస్తున్నా రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు.
తూతూమంత్రంగా నివేదికలు
ప్రస్తుత యాసంగి సీజన్లో సాగు చేసిన మొక్కజొ న్న, మామిడి పంటలతోపాటు మార్కెట్కు తీసుకెళ్లాల్సిన పసుపు పంట 2 రోజులుగా కురుస్తున్న అ కాల వర్షాలకు నేలవాలి నష్టం వాటిల్లినా.. ప్రభుత్వ నిబంధనల మేరకు పంట నష్టం జరగలేదని అధికారులు నివేదికలే రూపొందించడం లేదు. రాజకీయ నాయకులు మాత్రం హడావుడి చేసి రైతులను పరామర్శిస్తున్నారు. రైతులు రా జకీయ నాయకుల ఎదుట కన్నీళ్లపర్యంతమవడంతో.. నష్టపోయిన తోటల్లో నుంచే కలెక్టర్తోపాటు వ్యవసాయాధికారులకు ఫోన్లు చేస్తున్నారు. అధికా రులు చేస్తాం, చూద్దాం అనే రీతిలో తూతూమంత్రంగా ప్రాథమిక అంచనాలకే పరిమితమవుతూ చేతులు దులుపుకుంటున్నారు. చివరకు పరిహారం ఏమో కానీ.. పరామర్శలే ప్రాప్తంగా మారాయి. వారం రోజుల తర్వాత ఇటు అధికారులు, అటు రాజకీయ నాయకులు, రెతులు సైతం మర్చిపోతున్నారు.


