27 నుంచి శ్రీలక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాలు
మార్చి 11 వరకు నిర్వహణ అధికారులందరూ అందుబాటులో ఉండాలి సమన్వయ సమావేశంలో మంత్రి అడ్లూరి
ధర్మపురి: ధర్మపురిలోని శ్రీలక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవాలను ఈనెల 27 నుంచి మార్చి 11వరకు నిర్వహించనున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తెలిపారు. ఉత్సవాల సందర్భంగా చేపట్టే వసతులు, ఏర్పాట్లపై శనివారం సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. భక్తులకు సరిపడా వసతులు కల్పించాలని, మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని, తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఆర్డబ్ల్యూఎస్, నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు నిధుల కొరత లేదన్నారు. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు అధికారులు సెలవు పెట్టొద్దన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలను గోదావరి పుష్కరాలకు సెమీఫైనల్గా భావించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ రామన్న, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, ఏఎంసీ చైర్ర్సన్ లావణ్య, కౌన్సిలర్లు తదితరులున్నారు.


