నిరుత్సాహ పడొద్దు
– సత్యప్రసాద్, ఐఏఎస్, కలెక్టర్, జగిత్యాల
జగిత్యాల: సివిల్స్ అంటే కొందరికి భయంగా ఉంటుంది. సునాయాసంగా చదువుకుంటూ వెళ్లాలి. 24 గంటలు చదవడం ముఖ్యం కాదు. ప్రణాళిక ఏర్పాటు చేసుకుని సాధించాలన్న కసితో ముందుకెళ్లాలి. డిగ్రీ చేసిన ప్రతి అభ్యర్థి సివిల్స్ రాసేందుకు అర్హులు. గతంలో ఓసీ 6, బీసీ 9, ఎస్సీ వారికి ఎప్పుడైనా రాసే అవకాశం ఉండేది. ప్రస్తుతం కొన్ని మార్పులు జరిగినట్లున్నాయి. ముఖ్యంగా ఎకానమిక్స్, సైన్స్, జియోగ్రఫీ ఇలాంటివి అన్ని నోట్స్ తయారుచేసుకోవాలి. ప్రతిరోజు న్యూస్పేపర్స్ చదవడంతోపాటు ఇంటర్నెట్లో కొత్త సమాచారం తీసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్ను చదవాలి. 32 ఏళ్ల వయస్సు వరకు ఎన్నిసార్లు అయినా రాయవచ్చు. ఉద్యోగం చేస్తూ సైతం అభ్యర్థులు సివిల్స్కు ప్రయత్నించొచ్చు. ఓటములు ఎదురైనా నిరాశ చెందకుండా ముందుకెళ్తే పట్టు సాధించవచ్చు. 24 గంటలు చదివితేనే ఐఏఎస్ సాధించవచ్చనే భావన ఉంటుంది. కాదు.. సబ్జెక్ట్ ప్రకారం ప్రణాళిక తయారుచేసుకుని చదివితే ఈజీగా ముందుకెళ్లొచ్చు. ఇంతకుముందే సివిల్స్పై అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకోవాలి. సివిల్స్లో రైటింగ్ సైతం ఎంతో ముఖ్యం. ప్రతి ఒక్కరు నేను ఐఏఎస్ కొడతాననే ముందుకెళ్లాలి. ప్రతి విషయాన్ని నోట్ చేసుకుంటూ ముందుకెళ్లాలి. ఎస్సీఈఆర్టీ ఇంటర్, డిగ్రీలోని అంశాలే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఒత్తిడికి లోను కావద్దు. తేలికగా తీసుకునే మనస్తత్వం ఉంచుకోవాలి.


