హృదయ విదారకం.. ఒంటరిగా ఏడూస్తూ ఉక్రెయిన్‌ వీడుతున్న బాలుడు | Viral Video: Ukrainian Boy Crying While Walking To Poland Border Alone | Sakshi
Sakshi News home page

హృదయ విదారకం.. ఒంటరిగా ఏడూస్తూ ఉక్రెయిన్‌ వీడుతున్న బాలుడు

Mar 8 2022 5:12 PM | Updated on Mar 8 2022 8:30 PM

Viral Video: Ukrainian Boy Crying While Walking To Poland Border Alone - Sakshi

తాజాగా ఓ బాలుడు  దేశం వదిలి వెళ్లిపోతున్న దృశ్యం అందరినీ కలచివేస్తోంది. రష్యా దాడులకు భయపడి ఉక్రెయిన్ సరిహద్దులో ఒంటరిగా ఏడ్చుకుంటూ వలస పోతున్నాడు. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది.  

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మంగళవారానికి 13వ రోజుకు చేరుకుంది. రెండు దేశాల మధ్య భీకర పోరు కొనసాగుతూనే ఉంది. అయితే ఉక్రెయిన్‌ నుంచి పౌరులు తరలిపోయేందుకు వీలుగా కొన్ని మార్గాల్లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో వేల మంది సైనికులు, వందలాది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. యుద్ధ భయంతో లక్షలాది మంది దేశం విడిచి పొరుగు దేశాలైన పోలాండ్‌, హంగేరీ, రోమేనియాకు పోటెత్తుతున్నారు. ఉన్న ఉరిని వదిలి కట్టుబట్టలతో సరిహద్దులు దాడుతున్నారు.

ఈ క్రమంలో ఎన్నో హృదయ విదారక దృశ్యాలు సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు గుండెలను పిండేస్తున్నాయి.  తాజాగా ఓ బాలుడు  దేశం వదిలి వెళ్లిపోతున్న దృశ్యం అందరినీ కలచివేస్తోంది. రష్యా దాడులకు భయపడి ఉక్రెయిన్ సరిహద్దులో ఒంటరిగా ఏడ్చుకుంటూ వలస పోతున్నాడు. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది.  
చదవండి: రష్యా అరాచకం.. ఉక్రెయిన్‌పై 500 కిలోల భారీ బాంబు ప్రయోగం

శనివారం రోజు బాలుడు తన భుజంపై ఓ బ్యాగ్‌, అందులో బొమ్మను మోసుకుంటూ ఉక్రెయిన్‌ నుంచి పోలాండ్‌లోని మెడికాకు నడుచుకుంటూ వెళుతూ కనిపించాడు. అయితే బాలుడు ఒక్కడే వెళుతున్నాడా, ముందు వెనక తన వాళ్లు ఎవరైనా ఉన్నారా, ఆ అబ్బాయి ఎవరనే విషయాలపై స్పష్టత లేదు. దీన్ని చూసిన నెటిజన్లు.. బాలుడి పరిస్థితి చూస్తుంటే జాలేస్తోందని, కంటతడి పెట్టించే వీడియో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: Ukraine War: కాల్పుల విరమణ వేళ.. విరుచుకుపడుతున్న రష్యా బలగాలు

కాగా ఉక్రెయిన్‌పై రష్యా వరుస దాడులతో అనుక కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. తల్లి, తండ్రి, పిల్లలు తలో దిక్కులో చిక్కుకుపోయారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం వల్ల 1.7 మిలియన్లకు పైగా ప్రజలు దేశం విడిచి వెళ్లవలసి వచ్చిందని ఐక్యరాజ్యసమితి అధికారులు తెలిపారు. ఇక రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత వేగంగా పెరుగుతున్న శరణార్థుల సంక్షోభం పరిస్థితి ఇదేనని ఐరాస పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement