టెహ్రాన్లోని గ్రాండ్ మోసల్లా ప్రాంగణంలో భావోద్వేగ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తుదివీడ్కోలు కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు పోటెత్తారు. దేశ అత్యున్నత నాయకులు మొదలు.. సాధారణ ప్రజానీకం అంతా కన్నీరు పెట్టుకుంటున్న వీడియోలు బయటకు వస్తున్నాయి.
ఇరాన్పై ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన భౌతికకాయన్ని భద్రపరిచి ఉంచారు. తాజాగా.. యుద్ధ విరమణ, చర్చలు ముందుకు సాగుతుండడంతో.. మత పెద్దల సలహాతో అంత్యక్రియలకు సిద్ధపడ్డారు. ఆరు రోజుల పాటు.. నాలుగు ప్రాంతాల్లో ఖమేనీ పార్థివదేహాన్ని ఉంచి.. సంతాప కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Mohammad Bagher Ghalibaf cries during the farewell ceremony of Ali Khamenei. pic.twitter.com/i4DC5OgM2y
— Raz Zimmt (@RZimmt) July 3, 2026
టెహ్రాన్ గ్రాండ్ మోసల్లా వద్దకు వచ్చిన ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఘలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్మారక సభలో భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక వెక్కి వెక్కి ఏడ్చారు. ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. విదేశీ దౌత్య ప్రతినిధులు, పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ అధినేతలు కలిసి దాదాపు వంద దేశాల నుంచి పాల్గొనడంతో ఈ కార్యక్రమం ఒక పెద్ద అంతర్జాతీయ సంతాప సభగా మారింది.
భారత్ తరఫున కూడా ప్రతినిధులు పాల్గొని నివాళులు అర్పించారు. రష్యా, పాకిస్థాన్, టర్కీ సహా అనేక దేశాల ఉన్నతస్థాయి నేతలు హాజరయ్యారు. ఈ వేడుకలకు 15–20 మిలియన్ల మంది వరకు ప్రజలు హాజరవుతారని అంచనా వేశారు. ఇక.. ఖమేనీ అభిమానుల రాకపోకలను నియంత్రిస్తూ అధికారులు కఠిన భద్రతా చర్యలు అమలు చేశారు. ఉదయం 6 గంటలకు మాత్రమే గేట్లు తెరుస్తామని ముందుగానే ప్రకటించడంతో ప్రజలు భారీ సంఖ్యలో చేరుకున్నారు.
ప్రజల కన్నీళ్లు, నినాదాలు, సంతాప సందేశాలు మాత్రం టెహ్రాన్ను శోకసంద్రంలో ముంచాయి. తదుపరి రోజుల్లో కూడా ఈ సంతాప కార్యక్రమాలు కొనసాగనున్నాయి. టెహ్రాన్ తరువాత ఖోమ్, కర్బలా, నజాఫ్ మీదుగా ప్రయాణించి చివరికి మష్హద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.


