సాక్షి, న్యూఢిల్లీ: ఒమన్ తీరంలో భారత పతాకంతో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ప్రమాదంలో నౌక పూర్తిగా మునిగిపోయినప్పటికీ, అందులోని 14 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం వెల్లడించింది.
సోమాలియా నుండి బయలుదేరిన ఈ నౌక బుధవారం ఒమన్ తీరానికి సమీపంలో ఉండగా దాడికి గురైంది. దాడి కారణంగా నౌకలో భారీగా మంటలు చెలరేగి, చివరకు అది సముద్రంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న ఒమన్ కోస్ట్ గార్డ్ తక్షణమే స్పందించి, సిబ్బందిని రక్షించి 'దిబా' నౌకాశ్రయానికి తరలించారు.
భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం
ఈ దాడిని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. వాణిజ్య నౌకలు, పౌర నావికులను లక్ష్యంగా చేసుకోవడం "ఆమోదయోగ్యం కాదు" అని స్పష్టం చేసింది. "భారతీయ సిబ్బందిని సురక్షితంగా రక్షించినందుకు ఒమన్ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వాణిజ్య నౌకల స్వేచ్ఛకు ఆటంకం కలిగించడం, అమాయక పౌరుల ప్రాణాలను పణంగా పెట్టడం వంటి చర్యలను భారత్ సహించదు" అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
యూఏఈ సంఘీభావం
ఈ ఉగ్రవాద దాడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన అంతర్జాతీయ సముద్ర నావిగేషన్కు, ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్ర ముప్పు అని హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817ను ఈ దాడి స్పష్టంగా ఉల్లంఘించిందని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత నౌకల భద్రత కోసం తీసుకునే అన్ని చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని యూఏఈ ప్రకటించింది.
ఆందోళన కలిగిస్తున్న ప్రాంతీయ పరిస్థితులు
ఫిబ్రవరి 28న అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుండి భారత నౌకలపై దాడి జరగడం ఇది మూడవసారి. హర్మూజ్ జలసంధిలో భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్న తరుణంలో ఈ తాజా దాడి చోటుచేసుకోవడం గమనార్హం. వాణిజ్య మార్గాలను ఆర్థిక బ్లాక్మెయిల్ కోసం వాడుకోవడం పైరసీ చర్యలతో సమానమని, ఇది ప్రపంచ ఇంధన భద్రతకు ముప్పు అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
UAE Strongly Condemns Terrorist Attack on Indian-Flagged Ship off the Coast of Oman pic.twitter.com/gRArK2tniB
— MoFA وزارة الخارجية (@mofauae) May 14, 2026


