యుద్ధం చేయడానికి 15,289 కిలోమీటర్లు్ల ప్రయాణించాలి
దూరంగా ఉన్న తైవాన్ కోసం చైనాను ఢీకొట్టలేమని వ్యాఖ్య
వాషింగ్టన్: చైనా బారి నుంచి తమ మిత్రదేశం తైవాన్ను రక్షించే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతులెత్తేశారు. తైవాన్కు అండగా నిలుస్తామని, ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతామని ఇన్నాళ్లూ ప్రకటించిన ట్రంప్ చైనా అధినేత షీ జిన్పింగ్తో భేటీ తర్వాత మాట మార్చేశారు. ఎక్కడో దూరంగా ఉన్న తైవాన్ కోసం అత్యంత బలీయమైన చైనాను ఢీకొట్టలేమని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఎవరో(తైవాన్) స్వతంత్రంగా ఉండాలని తాను ఆకాంక్షించడం లేదన్నారు. చైనా నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకొనే ఆలోచన మానుకోవాలని తైవాన్కు సూచించారు. శుక్రవారం ఫాక్స్న్యూస్తో ట్రంప్ మాట్లాడారు.
‘‘మనం యుద్ధం చేయడానికి 15,289 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. నేను అది కోరుకోవడం లేదు. చైనాకు తైవాన్ ద్వీపం కేవలం 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్లు(తైవాన్, చైనా) సహనం వహించాలని కోరుతున్నాను. ఉద్రిక్తతలకు దూరంగా ఉండాలి. తైవాన్ ద్వీపం గురించి నేను, జిన్పింగ్ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అయితే, తైవాన్ను అమెరికా రక్షిస్తుందా? లేదా అనేదానిపై చర్చించడానికి నేను నిరాకరించా. తైవాన్ విషయంలో జిన్పింగ్కు స్పష్టమైన, బలమైన ఉద్దేశాలు ఉన్నాయి. తైవాన్ స్వాతంత్య్ర పోరాటం ఆయనకు ఎంతమాత్రం ఇష్టంలేదు’’అని ట్రంప్ స్పష్టంచేశారు. తైవాన్ విషయంలో ఇకపై జోక్యం చేసుకొనే ఆలోచన లేదని సంకేతాలిచ్చారు.
అమెరికా, చైనా.. జి–2
డొనాల్డ్ ట్రంప్ చైనాలో మూడు రోజుల పర్యటన పూర్తిచేసుకొని శుక్రవారం సాయంత్రం స్వదేశానికి తిరిగివచ్చారు. చైనా అధినేత షీ జిన్పింగ్తో జరిగిన చర్చలను రెండు గొప్ప దేశాల నాయకుల సమావేశంగా అభివర్ణించారు. అమెరికా వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూర్చే ఒప్పందాలతో సహా ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాలను చైనాతో కుదుర్చుకున్నట్లు చెప్పారు. ‘‘అమెరికా చైనాలు గొప్ప దేశాలు. నేను దీన్ని జి–2 అని పిలుస్తాను’’ అని అభివర్ణించారు.
చైనా బహుమతులు బుట్టదాఖలు
బీజింగ్: కీలకమైన ఒప్పందాల కోసం తన బృందంతో కలిసి చైనా పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరకు ఉత్తచేతులతోనే వెనక్కి వెళ్లిపోయారు. కొన్ని ఒప్పందాలు కుదిరాయని ట్రంప్ చెప్పినప్పటికీ వాటి వివరాలు బహిర్గతం చేయలేదు. ఒక దేశాధినేత మరో దేశానికి అధికారిక పర్యటనకు వెళ్లినప్పుడు బహుమతులతో సత్కరించడం ఆనవాయితీ. పుస్తకాలు కూడా బహూకరిస్తుంటారు.
అధినేత బృందంలోని సభ్యులకు కూడా బహుమతులు లభిస్తాయి. వాటిని స్వదేశానికి తీసుకెళ్తుంటారు. అధ్యక్షుడికి వచ్చినవి ప్రభుత్వ ఆస్తి. వాటిని వేలం వేయడమో లేదా మ్యూజియంలో భద్రపర్చడమో చేస్తుంటారు. కానీ.. ట్రంప్, ఆయన బృందం మాత్రం చైనా నుంచి ఏమీ తీసుకెళ్లకుండా తిరిగి వెళ్లిపోయారు. శుక్రవారం బీజింగ్లో ఎయిర్పోర్టులో ఎయిర్ఫోర్స్ వన్ విమానం సమీపంలో ఏర్పాటు చేసిన చెత్తకుండిలో వాటిని వదిలేశారు. చైనా వస్తువులేవీ తమ దగ్గర ఉండకుండా జాగ్రత్తపడ్డారు.
ట్రంప్ ప్రతినిధి బృందం, వైట్హౌస్ సిబ్బంది, ఆఖరికి అమెరికా జర్నలిస్టులు కూడా చైనా బహుమతులను ఇక్కడే విడిచిపెట్టారు. చైనా పర్యటనకు వచ్చినప్పుడు అమెరికా సిబ్బంది ఇలా చేయడం మొదటిసారి కాదు. కానీ, బహిరంగంగా అందరూ చూస్తుండగా బహుమతులను పక్కనపారేయడం మాత్రం ఇదే తొలిసారి. అమెరికా నుంచి వచ్చిన సిబ్బందికి చైనా అధికారులు ఫోన్లు, ఎల్రక్టానిక్ పరికరాలు, బ్యాడ్జ్లు, జ్ఞాపికలను గిఫ్ట్గా ఇచ్చారు. కానీ, అవన్నీ చైనాలోనే చెత్తకుండి పాలయ్యాయి. తమపై చైనా ప్రభుత్వం నిఘా పెడుతుందన్న భయంతోనే బహుమతులను వదిలేశారని తెలుస్తోంది.


