
లండన్: కోవిడ్–19కు కారణమయ్యే సార్స్–కోవ్–2 వైరస్ ప్రభావం చిన్నారులు, టీనేజీ యువతలో చాలా స్వల్పమేనని యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో నిర్వహించిన తాజా అధ్యయనంలో తేటతెల్ల మయ్యింది. వైరస్ కారణంగా వీరిలో తీవ్రమైన అనారోగ్యం, మరణాలు వంటివి అంతగా సంభవించడం లేదని తేలింది. అయితే, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతోపాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు, యువతపై కరోనా పంజా విసురుతున్నట్లు స్పష్టమయ్యింది.
యూకేలోని యూనివర్సిటీ కాలేజీ లండన్(యూసీఎల్), యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, యూనివర్సిటీ ఆఫ్ యార్క్, యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్ ఆధ్వర్యంలో 18 ఏళ్లలోపు వారిపై ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రతి 4,81,000 మందిలో ఒకరు కరోనాకు గురయ్యే అవకాశం ఉన్నట్లు గర్తించారు. అంటే ప్రతి 10 లక్షల మంది ఇద్దరు మాత్రమే వైరస్ బారినపడే ప్రమాదం ఉందని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. ఆరోగ్యవంతులైన పిల్లలు, యువత కోవిడ్–19కు భయపడాల్సిన పనిలేదని, వారిపై ఈ మహమ్మారి పెద్దగా ప్రభావం చూపదని యూసీఎల్ ప్రొఫెసర్ రస్సెల్ వినెర్ చెప్పారు.