నేపాల్‌తో బంధం మరింత బలోపేతం: చైనా | China says Treats Nepal As An Equal Message On 65th Year of Ties | Sakshi
Sakshi News home page

నేపాల్‌తో ద్వైపాక్షిక బంధం బలోపేతం: చైనా

Aug 1 2020 1:08 PM | Updated on Aug 1 2020 1:43 PM

China says Treats Nepal As An Equal Message On 65th Year of Ties - Sakshi

నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి- చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌(ఫైల్‌ఫొటో)

బీజింగ్‌/ఖాట్మండు: రాబోయే కాలంలో నేపాల్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు చైనా తెలిపింది. పరస్పర సహాయ, సహకారాలతో ముందుకు సాగుతామని స్పష్టం చేసింది. డ్రాగన్‌- హిమాలయ దేశాల మధ్య నెలకొన్న ద్వైపాక్షిక బంధానికి నేటితో 65 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌.. నేపాల్‌ అధ్యక్షురాలు విద్యాదేవీ భండారికి శనివారం ప్రత్యేక సందేశాన్ని పంపించారు. ‘‘ ఎల్లప్పుడూ ఒకరిని ఒకరం గౌరవించుకుంటూ.. సమానత్వ భావన కలిగి ఉండి పరస్పర విశ్వాసంతో ముందుకు సాగుతున్నాం. తద్వారా ఇరు వర్గాలకు లబ్ది చేకూరుతోంది. ఇక కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో మహమ్మారిపై పోరులో కలిసికట్టుగా పనిచేసి చైనా- నేపాల్‌ బంధంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాం’’అని ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాల గురించి ప్రస్తావించారు. (పాక్‌, అఫ్గాన్‌, నేపాల్‌ మంత్రులతో చైనా భేటీ!)

ఇక ఇందుకు స్పందనగా.. మానవాళి సంరక్షణకై చైనా ప్రతిపాదించిన అంశాలను స్వాగతిస్తున్నామని విద్యాదేవి అన్నారు. అదే విధంగా బెల్ట్‌ రోడ్‌ నిర్మాణంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా చైనా ప్రీమియర్‌ లీ కేయాంగ్‌ సైతం పరస్పర విశ్వాసం కలిగి ఉండి, స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుందామని నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలితో వ్యాఖ్యానించారు. కాగా ట్రాన్స్‌ హిమాలయన్‌ కనెక్టివిటీ నెట్‌వర్క్‌(టీహెచ్‌సీఎన్‌- టిబెట్‌ గుండా చైనా- నేపాల్‌ల మధ్య అనుసంధానానికై) ప్రాజెక్టును చైనా నిర్మించ తలపెట్టిన విషయం తెలిసిందే.(చైనా మరో ఎత్తుగడ.. బంగ్లాదేశ్‌కు మరిన్ని ప్రయోజనాలు!)

కాగా భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న నేపాల్‌ను మరింత మచ్చిక చేసుకునేందుకు డ్రాగన్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఇటీవల పరిణామాల ద్వారా స్పష్టమవతోంది. భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలైన లిపులేఖ్‌, లింపియదుర, కాలాపానీలను నేపాల్‌ తన భూభాగంలోకి కలుపుతూ కొత్త మ్యాప్‌లు విడుదల చేసింది. అంతేగాక కరోనా వ్యాప్తి నేపథ్యంలో నేపాల్‌ ప్రధాని భారత్‌కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం సహా.. అసలు సిసలైన రామజన్మ భూమి తమ దేశంలోనే ఉందంటూ వివాదానికి తెరతీశారు. ఈ క్రమంలో తన పదవికి ఎసరు రావడంతో చైనా ఆయనకు మద్దతుగా నిలిచింది.

రాజకీయ సంక్షోభం తలెత్తకుండా, అధికార నేపాలీ కమ్యూనిస్టు పార్టీలో చీలిక రాకుండా ఉండేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌- చైనాల మధ్య గల్వాన్‌ లోయ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న వేళ నేపాల్‌ సహా ఇతర సరిహద్దు దేశాలతో బంధం మరింత బలపరచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇక ఇప్పటికే పాకిస్తాన్‌కు మిత్రదేశంగా కొనసాగుతున్న డ్రాగన్‌‌, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌లకు కూడా అండగా నిలుస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే.(అధికార పార్టీ భేటీ వాయిదా.. రంగంలోకి ఆమె!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement