చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం..

China to Phase Out Foreign PCs, Software From SOEs - Sakshi

బీజింగ్‌: ప్రధాన విభాగాల్లో విదేశీ సాంకేతికతలను పక్కనబెట్టే దిశగా చైనా ప్రభుత్వం ముఖ్య నిర్ణయం తీసుకుంది. విదేశీ బ్రాండ్‌ పర్సనల్‌ కంప్యూటర్ల వాడకం మానేసి దేశీయ సంస్థలవే కొనాలంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్లలో ఈ ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలవుతాయని బ్లూమ్‌బర్గ్‌ వార్తాసంస్థ తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో ముందుగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని సుమారు 5 కోట్ల కంప్యూటర్లను పక్కనపడేయనున్నారు. వీటి స్థానంలో స్థానికంగా డిజైన్‌ చేసిన సాఫ్ట్‌వేర్‌తో కూడిన కంప్యూటర్ల వాడకం మొదలుకానుంది.

చిప్స్, సర్వర్లు, ఫోన్లు మొదలుకొని ప్రతిదానిపై అమెరికా వంటి ప్రత్యర్థి దేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలనే దశాబ్ద కాలంనాటి నిర్ణయం తాజా ఆదేశాలతో కార్యరూపం దాల్చనుంది. రెండేళ్ల కార్యాచరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ విభాగాలతో మొదలై ప్రొవిన్షియల్‌ ప్రభుత్వ విభాగాల్లోనూ స్థానిక సంస్థల తయారీ కంప్యూటర్ల వాడకం మొదలుకానుంది.  ప్రస్తుతం చైనాలో దేశీయ సంస్థ లెనోవో తర్వాత హెచ్‌పీ, డెల్‌ కంపెనీల పర్సనల్‌ కంప్యూటర్లే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. నూతన విధానంతో అమెరికాకు చెందిన హెచ్‌పీ, డెల్‌ తదితర సంస్థలపై మరింత ఒత్తిడి పెరగనుంది. అయితే, పీసీ బ్రాండ్లు, సాఫ్ట్‌వేర్‌కే తప్ప ఇంటెల్, ఏఎండీ ప్రాసెసర్ల మార్పిడిపై ఎలాంటి ఆదేశాలు లేవని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది.  
(భయపెట్టేలా రంగు మారిన ఆకాశం.. స్థానికుల్లో టెన్షన్‌) 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top