బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు చైనా పర్యటనకు శ్రీకారం చుట్టారు. కొద్ది సేపటి క్రితమే బీజింగ్కు బయిలుదేరారు. అయితే ఈ పర్యటనలో ఏ విషయాలపై ఒప్పంద జరగనుందా అని ప్రపంచమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ట్రంప్ ఎట్టిపరిస్థితుల్లో తమ దేశానికి సంబంధించిన నాలుగు అంశాల జోలికి వెళ్లద్దని వార్నింగ్ ఇస్తూ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
చైనా- అమెరికా మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే టాఫ్ ఎకానమీ కలిగిన దేశాలు కావడంతో అధిపత్యం కోసం పరస్పరం పోటీ పడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే మిడిల్ ఈస్ట్ యుద్ధంలో సైతం చైనా పరోక్షంగా ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. వీటిని చైనా కొట్టిపడేసింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ చైనా పర్యటనకు బయిలుదేరారు. ఆ నేపథ్యంలో ట్రంప్ అస్సలు.. ఈ రెడ్లైన్ అంశాలు చర్చించకూడదని చైనా పేర్కొంది.
నాలుగు ప్రధానమైన అంశాలు
తైవాన్ అంశం ఇది చైనాకు అత్యంత కీలకం.
ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కులు వీటి పేరుతో చైనా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.
దేశ రాజకీయ వ్యవస్థ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలోని సోషలిస్ట్ వ్యవస్థను గౌరవించాలి.
చైనా అభివృద్ధి హక్కు చైనా ఆర్థిక, సాంకేతిక వృద్ధిని అడ్డుకోకూడదు.
తైవాన్ వివాదం అనేది ప్రస్తుతం చైనా అమెరికా మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణం. తైవాన్కు అమెరికా ఆయుధాలను విక్రయించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం తైవాన్కు 11 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ ప్యాకేజీని ప్రకటించింది, ఇది ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఒప్పందం. దీనిపై చైనా మండిపడుతుంది.
తైవాన్ తమ భూభాగంలో భాగమని, ఇది పూర్తిగా తమ అంతర్గత విషయమని ఈ విషయంతో అమెరికా ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. కాగా 2017 తర్వాత ట్రంప్ చైనాను సందర్శించడం ఇదే మొదటిసారి. ట్రంప్ గతంలో ప్రకటించిన అధిక పన్నుల యుద్దం తర్వాత ఆయన చైనాకు వెళుతున్నారు. దీంతో ఏం జరగనుందా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.


