అమెరికాకు ఆ భయం పట్టుకుందా? | Burner Phones: Pentagon Labels Israeli Intelligence Threat Critical | Sakshi
Sakshi News home page

అమెరికాకు ఆ భయం పట్టుకుందా?

Jun 6 2026 4:56 PM | Updated on Jun 6 2026 6:08 PM

Burner Phones: Pentagon Labels Israeli Intelligence Threat Critical

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మధ్య విభేదాలను తీవ్రస్థాయికి చేరుకున్నాయా? అమెరికా- ఇజ్రాయెల్‌ మధ్య అసలేం జరుగుతోంది?. ఇరాన్ యుద్ధం.. వాషింగ్టన్‌- టెల్ అవీవ్ మధ్య చిచ్చురాజేసిందా?.. అంతర్జాతీయ మీడియా కథనాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లిన అమెరికా ప్రతినిధుల బృందం.. అక్కడ గూఢచర్యం భయాలతో బర్నర్‌ ఫోన్లను ఉపయోగించినట్లు కథనాలు వెలువడ్డాయి.

ఇజ్రాయెల్‌ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ నుంచి ముప్పు నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెంటగాన్‌ వర్గాలు స్పష్టం చేశాయి. ఎన్‌బీసీ న్యూస్ కథనం ప్రకారం.. మధ్యప్రాచ్యంపై ట్రంప్ యంత్రాంగం తీసుకుంటున్న అంతర్గత నిర్ణయాలు, ఉన్నతాధికారుల కదలికలపై నిఘా పెట్టేందుకు ఇజ్రాయెల్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందనే ఆందోళనలతో యుఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఓ అంతర్గత నివేదికను విడుదల చేసింది. డీఐఏ విడుదల చేసిన డాక్యుమెంట్‌లో ఏడు పేజీల నివేదికతో పాటు ఇజ్రాయెల్ గూఢచర్య కార్యకలాపాలను వివరించే ఒక చార్ట్ కూడా ఉంది.

ఇజ్రాయెల్‌కు ఉన్న హ్యూమన్ ఇంటెలిజెన్స్ , టెక్నికల్ సర్వైలెన్స్(సాంకేతిక నిఘా) సామర్థ్యాలు క్రిటికల్ స్థాయికి చేరుకున్నాయని ఈ నివేదిక తేల్చింది. అమెరికా రక్షణ శాఖలో ఆందోళనలు పెరగడానికి కారణమైన కొన్ని నిర్దిష్ట సంఘటనలను కూడా ఇందులో పేర్కొన్నారు. ఇరాన్, ప్రాంతీయ భద్రతాంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు పెరుగుతున్న సమయంలో.. అమెరికా నిర్ణయాలను ముందే తెలుసుకోవడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందనే అనుమానాలు వాషింగ్టన్‌లో బలపడుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలను ఇజ్రాయెల్‌ తీవ్రంగా ఖండించింది. అమెరికా అధికారులపై తాము నిఘా పెడుతున్నామనే వార్తలను తోసిపుచ్చింది.

ఇజ్రాయెల్ అమెరికా ప్రభుత్వ అధికారులపై గానీ.. అక్కడి సంస్థలపై గానీ ఎలాంటి సమాచారాన్ని సేకరించదు. మా నిఘా వ్యవస్థలు కేవలం శత్రువులను లక్ష్యంగా చేసుకుంటాయి. మిత్రదేశాలను కాదు. దీనికి విరుద్ధంగా వచ్చే వార్తలన్నీ అవాస్తవాలు, రాజకీయ ప్రేరేపితమైనవిగా ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ ప్రతినిధి కొట్టిపారేశారు.

మరోవైపు, పెంటగాన్ దీనిపై స్పందించడానికి నిరాకరించగా.. వైట్ హౌస్ అధికారి ఒకరు ఈ ఆరోపణలను ఖండిస్తూ.. ఈ కథనం పూర్తిగా అవాస్తవం, సరైన అవగాహన లేని వ్యక్తుల సమాచారం ఆధారంగా ఈ కథనాలు సృష్టించారన్నారు. గత ఏప్రిల్‌లో కుదిరిన కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య విభేదాలు వచ్చిన తరుణంలో ఈ నివేదిక వెలుగులోకి రావడం గమనార్హం.

ట్రంప్ టెహ్రాన్‌తో దౌత్యపరమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి మొగ్గు చూపుతుండగా.. ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ ఏ ఒప్పందాన్ని గౌరవించదని.. మరింత కఠినమైన సైనిక చర్యలే సరైనవని వాదిస్తోంది. ఈ విషయమై ఇటీవల ఇద్దరు నేతల మధ్య ఫోన్ సంభాషణలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుందని.. ఆ తర్వాత ట్రంప్.. నెతన్యాహుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.

అమెరికా అధికారులు అధికారిక పర్యటనల నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లినప్పుడు అదనపు భద్రతా జాగ్రత్తలు తీసుకుంటారని ప్రస్తుత, మాజీ అధికారులు గుర్తుచేశారు. ఇందులో భాగంగా బర్నర్ ఫోన్లు (తాత్కాలిక ఫోన్లు), తాత్కాలిక కంప్యూటర్లు, కఠినమైన కమ్యూనికేషన్ నిబంధనలను పాటిస్తారు. ఇజ్రాయెల్‌ పర్యటనల్లో అమెరికా ఇప్పటికే అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది. సమాచారాన్ని దూకుడుగా సేకరించడంలో ఇజ్రాయెల్‌ దిట్ట అని అందరికీ తెలిసిందేనంటూ ఓ అధికారి వ్యాఖ్యానించారు.

అమెరికా, ఇజ్రాయెల్‌లు దశాబ్దాలుగా ఇంటెలిజెన్స్ రంగంలో సహకరించుకుంటూ అత్యంత సన్నిహిత వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నప్పటికీ, ఇరాన్ విషయంలో తలెత్తిన విభేదాల సమయంలో ఇజ్రాయెల్ నిఘా పెడుతోందనే అనుమానాలు మిత్ర దేశాల మధ్య నమ్మకాన్ని మరింత దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement