డూమ్స్‌డే ఎయిర్‌క్రాఫ్ట్‌ రెడీ! | Boeing E-4B Nightwatch: US Doomsday Plane lands in Washington | Sakshi
Sakshi News home page

డూమ్స్‌డే ఎయిర్‌క్రాఫ్ట్‌ రెడీ!

Jun 20 2025 4:30 AM | Updated on Jun 20 2025 12:51 PM

Boeing E-4B Nightwatch: US Doomsday Plane lands in Washington

మేరీల్యాండ్‌కు చేరుకున్న ‘ప్రళయకాల’ విమానం 

రక్షణ కోసం ముందస్తుగా తెప్పించిన ట్రంప్‌ సర్కార్‌! 

వాషింగ్టన్‌: అత్యంత అరుదైన సందర్భాల్లో వాడే శత్రు దుర్భేద్య  ఈ–4బీ రకం విమానం హఠాత్తుగా అగ్రరాజ్య గగనతలంలో కనిపించి ఆశ్చర్యానికి గురిచేసింది. యుద్ధంలో ఇరాన్‌పై అమెరికా బాంబులేస్తే ప్రతిదాడిగా ఇరాన్‌ సైతం అమెరికాపై బాంబుల వర్షం కురిపించొచ్చు. అలాంటి సందర్భాల్లో భూమిపై ఎక్కడా దిగకుండా గాల్లో చక్కర్లు కొడుతూనే అమెరికా రక్షణ మంత్రిసహా కీలక ఉన్నతాధికారులు పాలన సాగించేందుకు ఈ విమానాన్ని వినియోగిస్తారు. 

ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోబోతోందన్న వార్తల నడుమ ఈ అధునాతన లోహవిహంగం ప్రత్యక్షమవడం గమనార్హం. ఈ విమానాన్ని బోయింగ్‌ 747–200బీ మోడల్‌లో మార్పులు చేసి తయారు చేశారు. అమెరికాలో యుద్ధంవస్తే అంటే ప్రళయకాలంలో వాడే విమానంగా దీనికి డూమ్స్‌డే ఎయిర్‌క్రాఫ్ట్‌ అనే పేరుంది. దీనిని ‘నైట్‌వాచ్‌’, ‘ఫ్లయింగ్‌ పెంటగాన్‌’ అని మారు పేర్లు కూడా ఉన్నాయి. ఈ విమానం మంగళవారం లూసియానాలోని బోస్సియర్‌ వైమానిక స్థావరం నుంచి మేరీల్యాండ్‌లోని జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌కు చేరుకుంది. 

ఎన్నెన్నో ప్రత్యేకతలు..  
ఈ విమానం ఏకధాటిగా 7,000 మైళ్ల దూరం ప్రయాణించగలదు. సిబ్బంది సహా 112 మంది వరకు ప్రయాణించే సదుపాయం ఉంది. గతంలో ఈ విమానం అత్యధికంగా ఏకధాటిగా 35 గంటలపాటు ఎగిరింది. శత్రుదాడులను తట్టుకునేలా అంటే సైబర్‌ దాడులు, అణుబాంబుపేలుళ్ల ప్రకంపనలు, విద్యుదయస్కాంత ప్రభావాలకు లోనుకాకుండా దీనిని పటిష్టంగా నిర్మించారు. న్యూక్లియర్, థర్మల్‌ కవచాలు దీనికి తొడిగారు. గాల్లో ప్రయాణిస్తూనే ఇందులోని అధికారులు ప్రపంచం నలుమూలల ఉన్న స్వదేశీ, విదేశీ నేతలు, అధికారులకు ఆదేశాలు జారీచేయొచ్చు. దీనిలో ఏకంగా 67 ఉపగ్రహ డిష్‌ వ్యవస్థలు ఉన్నాయి.  
 


యుద్ధవిమానంగానూ.. 
అత్యవసర సందర్భాల్లో యుద్ధవిమానంగానూ మారిపోతుంది. వెంటబడే శత్రు విమానాలపై బాంబులను ప్రయోగించగలదు. మళ్లీ ల్యాండింగ్‌ చేయాల్సిన పనిలేకుండా గాల్లోనే ఇంధనాన్ని నింపుకోగలదు. ఈ మొత్తం విమానంలో ఉన్నతాధికారుల విశ్రాంతి కోసం 18 పడకలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు పెద్ద సమావేశ గది ఏర్పాటుచేశారు. ఈ విమానం మొత్తంగా మూడు అంతస్తుల్లో ఉంటుంది. 9/11 దాడుల తర్వాత ఈ సిరీస్‌ విమానంలో నాటి అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ పలుమార్లు ప్రయాణించారు. 1995లోనూ హరికేన్‌ ఓపెల్‌ ఘటన సమయంలో ఫెడరల్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ ఉన్నతాధికారులు ఇందులోంచే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా వాయుసేనలో ఇలాంటివి నాలుగు విమానాలు ఉన్నాయి. యుద్ధ సన్నద్థతను పరీక్షించేందుకే ఈ విమానాన్ని వాషింగ్టన్‌కు తీసుకొచ్చారని అంతర్జాతీయ మీడియా తెలిపింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement