సాక్షి, సిటీబ్యూరో: భూ వివాదానికి సంబంధించి న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘిస్తూ అతిక్రమణ, ఆస్తి నష్టం, ప్రాణహాని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ శ్రీనాథ్ స్పిన్నర్స్ మేనేజర్ నగేష్ సుతారి మేడ్చల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు నమోదైన ఎఫ్ఐఆర్లోని అంశాల ప్రకారం. మేడ్చల్ ఐడీఏలోని సర్వే నంబరు 859లో 3 ఎకరాలు స్థలం ఉంది. సదరు ఆస్తిపై మేడ్చల్ న్యాయస్థానంలో కేసు ఉంది. ఈ స్థలంలో 2001 నుంచి శ్రీనాథ్ స్పిన్నర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యకలాపాలను సాగిస్తున్నామని, ఈ క్రమంలో ఈనెల 1న రాత్రి 11.40 గంటలకు మంతెన రవి వర్మ రాజు, మంతెన నాగజ్యోతి, రాములు గౌడ్, ఈ సాంబయ్య, ఈ సందీప్ రాజ్, వారి అనుచరులు పథకం ప్రకారం తమ ప్రాంగణంలోకి చొరబడ్డారని నగేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లు, ద్విచక్ర వాహనాలు, కార్లతో వచ్చి ఫ్యాక్టరీ గేట్లను, ప్రహారీ గోడలను పగులగొట్టి ప్రాంగణంలోకి దౌర్జన్యంగా ప్రవేశించారన్నారు. ఆస్తికి నష్టం కలిగించడంతో పాటు మిల్లులో ఉన్న కార్మికులపై దాడులకు దిగారని ఆరోపించారు. ఈ దాడిలోకార్మికుడు రంజన్ మల్లిక్కు తీవ్ర గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత సదరు దుండగులు సంఘటనా స్థలం నుంచి పారిపోయారన్నారు. జేసీబీ (ఏపీ01పీ131), టిప్పర్ (టీఎస్08యూఎల్2449), ద్విచక్ర వాహనాలు (టీఎస్07ఎఫ్యూ4486, టీజీ153200)లను ఘటనా స్థలంలోనే వదిలేసి వెళ్లారన్నారు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ డబ్బాతో అగ్ని ప్రమాదం సృష్టించాలనే దురుద్దేశంతో వచ్చినట్లు కనిపిస్తోందని నగేష్ ఆరోపించారు. 2001, 2021, 2022 సంవత్సరాలలో కూడా రాములు గౌడ్, సాంబయ్య, సందీప్ రాజ్లు అక్రమంగా ప్రవేశించే ప్రయత్నం చేశారన్నారు.ఈ నేపథ్యంలో పోలీసులు తమకు రక్షణకల్పించాలని నగేష్ కోరారు.
జేసీబీలు, టిప్పర్లతో అర్ధరాత్రి చొరబడిన దుండగులు
మేడ్చల్ ఠాణాలో ఫిర్యాదు చేసిన శ్రీనాథ్ స్పిన్సర్స్ మేనేజర్ నగేష్


