ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో ఈ నెల 24 నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ మహిళా సదస్సు నిర్వహిస్తున్నట్లు వీసీ ప్రొ.కుమార్, సదస్సు కన్వీనర్ ప్రొ.విజ్జులత తెలిపారు. సదస్సుకు ప్రముఖ సినీనటి, రాజకీయ నాయకురాలు గౌతమి తడిమల్ల హాజరవుతారన్నారు. శుక్రవారం ఓయూ అతిథి గృహాంలో సదస్సు వివరాలను వెల్లడించారు. వర్సిటీ క్యాంపస్లోని ఠాగూర్ ఆడిటోరియంలో 24న ప్రారంభ సదస్సుకు రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. మహిళా శక్తి–సుస్థిరత అనే అంశం జరిగే సదస్సులో దేశ విదేశాలకు చెందిన 250 మంది పరిశోధన పత్రాలను సమర్పిస్తుండగా, 1200 మంది మహిళా ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు.
రూ.1000 కోట్ల కేటాయింపుపై వీసీ హర్షం
ఓయూకు గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన రూ.1000 కోట్లను రాష్ట్ర బడ్జెట్లో కేటాయించడం పట్ల ఉస్మానియా వీసీ ప్రొ.కుమార్ హర్షం వ్యక్తం చేశారు. మౌలిక వసతుల అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులను మంజురు చేశారన్నారు.


