
డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
● విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ● రూ.7.5 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు ధ్వంసం
గన్ఫౌండ్రీ: రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీరియస్గా ఉన్నారని, అందులో భాగంగా నగరంలో డ్రగ్స్ విక్రయాలు, వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. గురువారం గోషామహల్ పోలీస్ స్టేడియంలో నార్కోటిక్స్ వింగ్ స్వాధీనం చేసుకున్న డ్రగ్స్, గంజాయి, తదితరాలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డ్రగ్స్ను కట్టడి చేస్తున్నామని, వాటి రవాణా మార్గాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత రెండు నెలలుగా డ్రగ్స్ అక్రమ రవాణా తగ్గిందన్నారు. గత మూడేళ్లల్లో 1200 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు పట్టుబడిన డ్రగ్స్ను ధ్వంసం చేస్తున్నట్లు తెలిపారు.
మాదకద్రవ్యాలు ధ్వంసం
ఈ ఏడాది ఇప్పటి వరకు 208 కేసుల్లో రూ.7.50 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. ఇందులో 2140 కిలోల గంజాయి, 3.8 కిలోల డ్రగ్స్, 12,669 ఎంఎల్ హాష్ ఆయిల్, 540 ఆల్ప్రోజోలం మాత్రలు, 19.34 గ్రాముల కొకై న్, 4,ఎల్ఎస్డీ, 177.75 గ్రాముల ఎండీఎంఏ, 70 గ్రాముల ఒపీయం ఉన్నట్లు ఆయన వివరించారు.