
ప్రముఖ మిద్దెతోట రైతు, రచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డి మేడ్చల్ జిల్లా నారపల్లిలో తన ఇంటిపైన 1,242 చదరపు అడుగుల్లో మిద్దెతోటను ఏర్పాటు చేసుకున్నారు. తమ ఇంటికి కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను మిద్దైపెనే పండించుకొని తింటున్నారు. 2010 నుంచి మార్కెట్లో కొనటం మానేశారు. వేసవిలోనూ కొరత లేకుండా ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల దిగుబడి వచ్చేలా ఆయన ప్రణాళిక ప్రకారం మిద్దెతోటను ఇటుకలతో ఎత్తు మడులను నిర్మించుకోవటం విశేషం. ప్రతి 3 మడుల్లో రెండింటిలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు.. ఒక మడిలో మండ్ల మొక్కలు పెంచుతున్నారు. రెండు, మూడేళ్లకు పండ్ల మొక్కలు పెద్దవైన తర్వాత ఆ చెట్ల నీడ ఇతర మడుల్లో కూరగాయలు, ఆకుకూరల మొక్కలను వేసవిలో కాపాడుతుంది. వేసవిలో రోజూ ఉదయం, సాయంత్రం 2,3 నిమిషాల పాటు మిద్దెతోట మొక్కలన్నిటిపై నీటి జల్లు కురిపించటం రఘోత్తమరెడ్డి ప్రత్యేకత. ఆ విధంగా మడులు, కుండీల్లో మట్టి, మొక్కలు కూడా రోజుకు రెండు సార్లు చెమ్మగిల్లుతాయి. కాబట్టి వేసవి తాపాన్ని షేడ్నెట్ అవసరం లేకుండానే తట్టుకొని కూరగాయలు, పండ్లను అందిస్తున్నాయని రఘోత్తమరెడ్డి వివరించారు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలున్నా తమ ఇల్లు చల్లగా ఉంటుందని, మిద్దెతోట చెక్కుచెదరకుండా ఉందన్నారు. ప్రస్తుతం వాటర్ ఆపిల్ రెండు రకాలు, అరటి, సపోటా పండ్లతో పాటు వంగ, టొమాటో, మునగ, బీర, అలసంద, కాకర.. తోటకూర, పాలకూర, చుక్క కూర, పొన్నగంటి, చెన్నంగి, బచ్చలి వంటి ఆకుకూరలు మిద్దెతోట తమకు అందిస్తోందన్నారు. తమ మిద్దెతోట ఇప్పుడు సహజ అడవిరూపాన్ని సంతరించుకొందని చెబుతూ.. విత్తనాలు వేయనవసరం లేదు.. పంట మొక్కల నుంచి రాలిన విత్తనాలే తిరిగి మొలుస్తున్నాయ్నారు. వేసవికి ముందు ఫిబ్రవరి ఆఖరు నాటికి మిద్దెతోటలో ఉండే మొక్కలన్నీ కనీసం నెల వయసువి ఉండేలా చూసుకుంటే మొక్కలు వేసవిని తట్టుకొని దిగుబడిని అందిస్తాయని ఆయన సూచించారు.
తుమ్మేటి రఘోత్తమరెడ్డి