
సాక్షి, సిటీబ్యూరో: ఆహార భద్రత (రేషన్) కార్డులోని లబ్ధిదారుల ఈ–కేవైసీ పై పౌరసరఫరాల శాఖ దృష్టి సారించింది. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యం కోటాకు లబ్ధిదారుల ఈ–కేవైసీ పునరుద్ధరణ తప్పని సరిచేసింది. డీలర్ల వద్ద గల ఈ–పాస్ యంత్రంలో సాఫ్ట్వేర్ ఆప్డేట్ ద్వారా కేవైసీ పునరుద్ధరణకు అవకాశం కల్పించింది. రేషన్కార్డులోని కుటుంబ పెద్దతోపాటు మిగిలిన లబ్ధిదారులందరూ ఈ–పాస్ ద్వారా తమ కేవైసీని పునరుద్ధరించుకునే విధంగా చర్యలు చేపట్టింది. లబ్ధిదారుల కేవైసీ పునరుద్ధరణ పక్రియ త్వరలో పూర్తి చేయాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు.
20 శాతంపైనే..
రాష్ట్రంలో 90.94 లక్షల రేషన్ కార్డులు ఉండగా, వాటిలో 2.82 కోట్ల లబ్ధిదారులు ఉన్నారు. అందులో సుమారు 20 శాతం పైగా లబ్ధిదారులు అందుబాటులో లేనట్లు పౌరసరఫరాల శాఖ అధికారుల అంచనా. కార్డులోని లబ్ధిదారులు మరణించడం, ఆడబిడ్డలకు పెళ్లిళ్లు జరిగి వెళ్లిపోవడం, మగ పిల్లలుంటే పెద్దయ్యాక పెళ్లిళ్లు జరిగి కుటుంబాలు విడిపోవడం తదితరాలు ఇందుకు కారణంగా తెలుస్తోంది. వాస్తవంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత రేషన్ కార్డుల పునరుద్ధరణ ప్రక్రియ వైపు పౌరసరఫరాల శాఖ దష్టి సారించలేదు. కార్డు కలిగిన కుటుంబ సభ్యుల్లో(యూనిట్లు) కొందరు లేకున్నా బియ్యం మాత్రం యూనిట్ ఒక్కింటికి ఆరు కిలోల చొప్పన పంపిణీ జరుగుతూ వస్తోంది.
ఇప్పటికే ఐదు లక్షల యూనిట్ల గుర్తింపు
రేషన్కార్డులోని లబ్ధిదారుల్లో సుమారు పది శాతం వరకు సభ్యులు మృతి చెందినట్లు పౌరసరఫరాల అధికారులు గుర్తించారు. ఈ పాస్లో ఈ–కేవైసీ ప్రక్రియ ప్రారంభం కావడంతో తొలి వారంలో సుమారు 5 లక్షల యూనిట్లను గుర్తించి వాటిని తొలగించినట్లు తెలుస్తోంది. మిగతా యూనిట్ల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.
కేవైసీ పునరుద్ధరణ ఇలా..
రేషన్ కార్డులో పేర్లు గల కుటుంబ సభ్యులందరూ చౌకధరల దుకాణానికి వెళ్లి ఈ పాస్ యంత్రంలో వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. వేలిముద్ర వేయగానే రేషన్ కార్డు నంబరుతో పాటు అతని ఆధార్ కార్డు నంబరు చూపిస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా ఆకుపచ్చ వెలుగు వచ్చి సదరు వినియోగదారుడి కేవైసీ పునరుద్ధరించబడుతుంది. ఒకవేళ కేవైసీ పునరుద్ధరణలో ఈ పాస్ యంత్రంలో రెడ్ వెలుగు వస్తే సదరు వినియోగదారుని రేషన్కార్డు .. ఆధార్ నెంబర్తో సరిపోల్చలేదంటూ తిరస్కరిస్తుంది. ఆ తర్వాత రేషన్కార్డులోని ఆ యూనిట్ను తొలగిస్తారు.
● ఉదాహరణకు ఒక కుటుంబంలో ఐదుగురు సభ్యులు (యూనిట్లు) ఉంటే అందరూ కేవైసీ పునరుద్దరించుకోవాల్సిందే. ఒకవేళ ఒకరో, ఇద్దరో గైర్హాజరైతే వారు కుటుంబం నుంచి దూరం అయ్యారని, లేనట్లుగా గుర్తిస్తూ అందుబాటులో ఉన్న వ్యక్తుల కేవైసీ పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో ‘గైర్హాజరైన ఆ యూనిట్ల వివరాలు’ ఈ పాస్ యంత్రంలో నమోదై ఉంటాయి. తద్వారా ఆ యూనిట్లు తొలగింపునకు గురవుతాయి. రేషన్కార్డులోని యూనిట్ల కేవీసీ ప్రక్రియ పూర్తి తర్వాతనే కొత్త సభ్యుల అప్డేషన్కు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
ఈ–పాస్ ద్వారా పునరుద్ధరణ లబ్ధిదారులందరికీ తప్పనిసరి
పునరుద్ధరణ కాని యూనిట్ల కోటా కట్