మచ్చుకు కొన్ని..
వరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగర పాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ)లో పనులు, బిల్లులు కొందరు బడా కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళుతున్నాయా..? లీకేజీల నుంచి మొదలుకొని అభివృద్ధి పనులు కొందరికే దక్కుతున్నాయా..? మధ్య, చిన్న తరహా కాంట్రాక్టర్లకు చోటు లభించడం లేదా..? అధికారులు కూడా పెద్దస్థాయి కాంట్రాక్టర్లను ప్రోత్సహిస్తున్నారా..? అంటే ప్రస్తుతం బల్దియా పనుల్లో జరుగుతున్న తంతు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంజనీర్లకు కొందరు కాంట్రాక్టర్లకు మధ్య ఉన్న అవగాహన ‘ఒప్పందం’ అలాంటిదని, అందుకే కొందరు చేతుల్లో పనులన్నీ వెళ్లడం, పనులు కొంత మేరకు జరిగినా, ఒకవేళ పూర్తయినా బిల్దియా నుంచి బిల్లుల స్వీకరణలో వీరే ముందంజలో ఉంటుండడంతో కొందరి కనుసన్నల్లోనే బల్దియా కాంట్రాక్ట్లు నడుస్తున్నాయన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది. దీంతో సాధారణ, ఔత్సాహిక కాంట్రాక్టర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇదే విషయమై శనివారం గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయ వేదికగా సుమారు అరగంటపాటు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
పనుల పంపకాలు
జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం నల్లా పైపులైన్ల లీకేజీల నుంచి పార్కులు, నర్సరీల నిర్వహణ, అభివృద్ధి పనులు, ఎలక్ట్రికల్ పనులన్నీ టెండరింగ్ నడుస్తోంది. వరంగల్, హనుమకొండ ప్రాంతాలుగా వేర్వేరు యూనియన్లు ఏర్పాటయ్యాయి. యూనియన్ల ప్రతినిధులే పనుల పంపకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బల్దియాలో ఇంజనీరింగ్, ఉద్యాన వన విభాగాల్లో అత్యధికంగా నిధులు ఖర్చవుతుంటాయి. వీటికి ఈ–ప్రొక్యూర్మెంట్ విధా నం ద్వారా టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రెండు వేర్వేరు యూనియన్ నాయకులు కలిసి టెండర్ నోటిఫికేషన్ పనుల వివరాలను తెలుసుకొని కాంట్రాక్టర్ల నుంచి 4శాతం చొప్పన కమీషన్ ముందస్తుగా వసూలు చేస్తూ పనులు పంపకాలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆర్థిక స్థోమత కలిగిన బడా కాంట్రాక్టర్లు తమ లైసెన్సులే కాకుండా నాలుగైదు బినామీ లైసెన్ల పేర్లతో కమీషన్లు ముట్టజెప్పి పనులను దక్కించుకుంటున్నట్లు విమర్శలున్నాయి. చిన్నాచితక వారు ఒకవేళ టెండర్ వేసినా డీబీ సెక్షన్ సిబ్బందితో అనేక కొర్రీలు పెట్టించి, నానా రకాలుగా ఒత్తిళ్లు చేయిస్తూ ఆ టెండర్ నుంచి తప్పుకుంటున్నట్లు రాత పూర్వకంగా లేఖలు ఇప్పిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసినా.. చిన్నాచితక కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నా వారికి కంఠశోష తప్ప ప్రయోజనం లేకుండా పోతోంది.
వరంగల్ ప్రాంతానికి చెందిన ఓ బడా కాంట్రాక్టర్ సీకేఎం కళాశాల వద్ద డ్రెయినేజీ, లేబర్ కాలనీ–బాలాజీనగర్లో యూజీడీతోపాటు మరో 6 పనులు మొత్తంగా ఆయన చేతిలో రూ.15కోట్ల విలువైన వర్క్లున్నాయి. చేసిన మేరకు బిల్లులిస్తేనే మిగతా పనులు చేపడుతానని నిబంధన పెడుతున్నాడు.
హనుమకొండలో యూనియన్ పెద్దలతో ఒకరు లోపాయికారీ ఒప్పందంతో 8 డివిజన్లలో రూ.20కోట్ల విలువైన పనులు చేస్తున్నాడు. ఇవ్వాల్సిన పర్సంటేజీలిస్తూ పనులు, బిల్లులు పొందుతున్నాడు.
ఉద్యాన విభాగంలో కాంట్రాక్టర్ నామినేషన్ పద్ధతిలో సుమారు రూ.2కోట్ల విలువైన పనులు పూర్తి చేసి బిల్లులు పొందాడు.
గ్రేటర్ వరంగల్లో గుత్తాఽధిపత్యం
పనుల పంపకాలు, పరపతితోనే బిల్లులు
అండగా ఇంజనీర్లు.. ఆందోళనలో చోటామోటా కాంట్రాక్టర్లు
బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో లొల్లిలొల్లి


