హన్మకొండ కల్చరల్: శాకంబరీ నవరాత్రోత్సవాలను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ అమ్మవారి అనుగ్రహం పొందాలని భద్రకాళి దేవాలయ ఈఓ, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత అన్నారు. ఆలయ ప్రాంగణంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామల సునీత, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, సిబ్బంది పాల్గొని శాకంబరీ ఉత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం రామల సునీత మాట్లాడుతూ.. ఈ నెల 15 బుధవారం నుంచి జూలై 29 బుధవారం వరకు 15రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ.. రోజూ అమ్మవారికి వివిధ క్రమాలలో పూజలు నిర్వహించనున్నట్లు, జూలై 29న మహా శాకంబరీగా అమ్మవారు దర్శనమిస్తారని తెలిపారు. ముఖ్యార్చకులు చెప్పెల నాగరాజుశర్మ, సిబ్బంది కూచన హరినాఽథ్, అలుగు కృష్ణ, చింత శ్యామ్సుందర్ పాల్గొన్నారు.
వరంగల్ అర్బన్: ఇటీవల సాక్షిలో ప్రచురితమైన ‘జీతం మహాప్రభో’ కథనానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ టి.వెంకన్న స్పందించారు. ఆగమేఘాల మీద ఆయా విభాగాల అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేసి, అకౌంట్ ద్వారా వరంగల్ ఔట్సోర్సి ంగ్ కార్మికులకు వేతనాలు ఇప్పించారు. దీంతో కార్మికులకు ఉపశమనం కలిగింది.
కేయూ క్యాంపస్: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకుగాను తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ప్రవేశ పరీక్షలు శనివారం నాలుగో రోజు కొనసాగినట్లు కన్వీనర్ ప్రొపెసర్ కె.రాజేందర్ తెలిపారు. ఉదయం సెషన్లో ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సుకు 2,681 మంది అభ్యర్థులకుగాను 2,323 మంది పరీక్ష రాశారు. మధ్యాహ్నం సెషన్లో ఎంఎల్ఐఎస్సీ/బీఎల్ఐఎస్సీ కోర్సుకుగాను 736 మందికి 600 మంది హాజరయ్యారు. సాయంత్రం సెషన్లో నిర్వహించిన జియోగ్రఫీ ప్రవేశపరీక్షకు 165 మందికి 145 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ క్యాంపస్ను శనివారం నేషనల్ తైవాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెంగ్ చూన్ హీ తన బృందంతో సందర్శించారు. నిట్ వరంగల్ అధ్యాపకులతో కార్బన్ డై ఆకై ్సడ్ వ్యర్థాల నుంచి ఉపయోగకరమైన స్వచ్ఛ ఇందనంగా మార్చే నూతన సాంకేతికతలపై, పరిశ్రమల నుంచి వెలువడే కార్డన్ను తగ్గించడంపై పరిశోధనల గురించి చర్చించారు. ఈసందర్భంగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తైవాన్ ప్రొఫెసర్ల బృందానికి కాకతీయ తోరణ జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ లీలా మనోహర్ ఏశాల, రాజేశ్ఖన్నా గడ్డం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రిక్విజిషన్ల లెటర్లు కరవయ్యాయి. దవాఖానకు వచ్చే రోగులకు వివిధ పరీక్షల సూచిస్తూ వైద్యులు రిక్విజిషన్ లెటర్లు రాస్తుంటారు. అయితే గత రెండు రోజుల నుంచి ఈ లెటర్లు లేకపోవడంతో తెల్ల కాగితాల మీదనే వైద్యులు రాయాల్సి వస్తోంది. దీంతో ఈ కాగితాలు కూడా ధర్మ చిట్టీల మాదిరిగా ఉండడంతో ల్యాబ్ సిబ్బంది సరిగ్గా గుర్తించలేకపోతున్నారు. అలాగే పరీక్షల రిపోర్ట్తో పాటు స్టాంపింగ్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్లు ఇస్తున్న తెల్ల కాగితాలు ఏమాత్రం సరిపోకపోవడంతో ల్యాబ్ సిబ్బంది కూడా మరో తెల్ల పేపర్పై వివిధ పరీక్షల వివరాలతో పాటు రిపోర్ట్, స్టాంపింగ్ వేసి ఇస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ల్యాబ్లో వివిధ పరీక్షలకు అవసరమైన కెమికల్స్, కిట్స్ వచ్చాయని చెబుతున్నారు.


