రెండేళ్లలో ‘మామునూరు’కు రెక్కలు
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయం మరో రెండేళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కేంద్రం ముందుకెళ్తోంది. రూ.850 కోట్ల వ్యయంతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆధ్వర్యంలో పూర్తిచేయనుంది. ఇక్కడ టెర్మినల్ బిల్డింగ్ కూడా నిర్మించనుంది. త్వరలోనే ఈ నిర్మాణ పనుల టెండర్లపై దృష్టి సారించనుంది. ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వద్ద ఉన్న 696.14 ఎకరాలకు అదనంగా కావాల్సిన 253 ఎకరాలను సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి గురువారం అధికారికంగా అప్పగించింది. హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ భూమికి సంబంధించి పత్రాలను కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖతో కూడిన బృందం అందించింది. దీంతో ఇక కేంద్ర ప్రభుత్వమే సాధ్యమైనంత తొందరగా నిర్మాణ పనులు చేయడం ద్వారా వరంగల్ అభివృద్ధి బాటలో పయనించే అవకాశముంది. ఈ మేరకు కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడి వ్యాఖ్యలతో ఏళ్లుగా ఆకాశంలో విహరించాలన్న వరంగల్ వాసుల కలనెరవేరే అవకాశముంది. ఇది అందుబాటులోకి వస్తే 150 నుంచి 186 మంది ప్రయాణించేలా వీలున్న 37.6 మీటర్లు(123 ఫీట్ల)పొడవనున్న ఏ 320, బీ–737 విమానాల రాకపోకలు సాగించనున్నాయి.
253 ఎకరాలను ఏఏఐకి అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం
రూ.850 కోట్ల వ్యయంతో
విమానాశ్రయ నిర్మాణం
త్వరలోనే ఆయా పనుల
టెండర్లపై కేంద్రం దృష్టి


