సంక్షేమం.. సాధికారత
ఖిలా వరంగల్: ప్రజా పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వినూత్న పథకాలకు శ్రీకారం చుడుతూ జిల్లా సమగ్రాభివృద్ధి, పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖిలా వరంగల్ మధ్యకోటలోని ఖుష్మహల్ మైదానంలో సోమవారం జరిగిన గణతంత్ర దినోత్సవంలో జాతీయ జెండాను కలెక్టర్ ఆవిష్కరించి, పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.
రైతు సంక్షేమమే ధ్యేయం
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెట్టపీట వేస్తోందని కలెక్టర్ సత్యశారద తెలిపారు. వానాకాలంలో 1,56,400 మంది రైతులకు 2,70,618 ఎకరాలకు నేరుగా వారి ఖాతాల్లో రూ.162.30 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు గుర్తు చేశారు. 54,226 మంది రైతులకు రూ.422.37 కోట్ల రుణమాఫీ చేసినట్లు చెప్పారు. మొంథా తుపాను కారణంగా 22,860 మంది రైతులకు రూ.20.54 కోట్ల పరిహారం అందించామన్నారు.
మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యం..
మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంగా బ్యాంకు లింకేజీ కింద 11,112 స్వశక్తి సంఘాలకు రూ.1094.14 కోట్లు మంజూరు చేశామని, శ్రీనిధి కింద రూ.114.40 కోట్ల రుణాలు, రూ.44.25 కోట్ల వడ్డీలేని రుణాలు మంజూరు చేశామని కలెక్టర్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 6,391 మందికి రూ.134.30 కోట్లు కేటాయించామని, 6,391 మంది డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులు ఖాతాల్లో రూ.134.30 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. అభయ హస్తం కింద 5.99 కోట్ల మంది మహిళలకు రూ.247.57 కోట్లు ప్రభుత్వం చెల్లించిందన్నారు. నగరంలో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనం నిర్మాణంలో ఉందని, ఏప్రిల్ నాటికి పూర్తిచేసి, వైద్య సేవలను అందిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
శరవేగంగా అభివృద్ధి పనులు
మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.295 కోట్లు విడుదల చేయగా, 253 ఎకరాల అదనపు భూమి సేకరించామని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని అన్నారు. రాతికోట చుట్టూ రూ.2 కోట్ల వ్యయంతో మోటు పునరుద్ధరణ పనులు, ఇన్నర్రింగ్ రోడ్డు, నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే పనులు, రూ.80 కోట్ల అంచనా వ్యయంతో సమీకృత కలెక్టరేట్, నివాస గృహాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. నగరంలో 2057 నాటి జనాభాను దృష్టిలో ఉంచుకొని రూ.4,170 కోట్ల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ వ్యవస్థకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. వరంగల్ పాత బస్స్టేషన్ స్థలంలో రూ.120 కోట్ల ఖర్చుతో ఐదు అంతస్తులతో అధునాతన సౌకర్యాలతో కూడిన భవనం నిర్మిస్తున్నామన్నారు. పాకాలలోని ఫారెస్ట్ పార్కులో సీతాకోక చిలుకల వనం ఏర్పాటు చేశామని, భద్రకాళి చెరువు ముంపు నివారణకు రూ.158 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. గణతంత్ర వేడుకల్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, నగర మేయర్ గుండు సుధారాణి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, ఆర్టీఓ సుమ, తహసీల్దార్లు ఇక్బాల్, శ్రీకాంత్, ఏసీపీలు సత్యనారాయణ,వె వెంకటేష్, ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్, ఎస్సైలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న స్టాళ్లు, నృత్య ప్రదర్శనలు
ఖుష్మహల్ మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ సత్యశారద సందర్శించారు. ఆసక్తిగా తిలకించి అధికారులను అభినందించారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో దేశభక్తిని చాటేలా నిర్వహించిన సాంస్కృతిక నృత్యాలు కనువిందు చేశాయి. జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
జిల్లా సమగ్రాభివృద్ధికి పెద్దపీట
రైతు అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి
విద్యా, వైద్యం, శాంతిభద్రతలకు
అధిక ప్రాధాన్యం
వరంగల్ గణతంత్ర దినోత్సవంలో
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
సంక్షేమం.. సాధికారత


