జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ రెవెన్యూ ఉద్యోగులకు మెగా ఉచిత వైద్య శిబిరం
గుంటూరు వెస్ట్: ఉద్యోగులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే ప్రజలకు సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరూ స్వీయ ఆరోగ్యంపై తగిన శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ అన్నారు. రెవెన్యూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా శనివారం స్థానిక బీఆర్ స్టేడియంలో రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే రెవెన్యూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ కోసం మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం అభినందనీయం అన్నారు. జిల్లాలోని ప్రతి రెవెన్యూ ఉద్యోగి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఉద్యోగులు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇందులో పాల్గొన్న వివిధ హాస్పిటల్ యాజమాన్యాలకు, డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా రెవెన్యూ ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోలేని పరిస్థితి ఉన్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి మెగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముందస్తుగా ఆరోగ్య సమస్యలను గుర్తించి, అవసరమైన వైద్య చికిత్స పొందేందుకు ఈ శిబిరాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. జిల్లాలో 3 వేల మందికి పైగా ఈ వైద్య శిబిరం ద్వారా సేవలు పొందారని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ఈస్ట్ ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ అహ్మద్, గుంటూరు ఆర్డీఓ కె. శ్రీనివాసరావు, జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ కె. విజయలక్ష్మి, ఏపీఎస్ఆర్ఏ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్, వైద్యులు పాల్గొన్నారు.


