● గుంటూరు కార్పొరేషన్లో 8 మంది
ఉద్యోగులపై సీడీఎంఏకు లేఖ
రాసిన కమిషనర్
● రూ.68.65 లక్షల దుర్వినియోగం
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో నకిలీ యూడీఏ (అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చలాన్లు, నకిలీ బ్యాంక్ స్టాంపింగ్ చలాన్ల వ్యవహారంపై చర్యలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. 2015 నుంచి 2017 వరకు నకిలీ బ్యాంక్ చలానాలు సృష్టించి రూ.68.65లక్షల అవినీతికి పాల్పడ్డారు. ఈ విషయం ఆడిట్ విభాగం కనిపెట్టి సదరు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరింది. సదరు అంశంపై ప్రభుత్వ ఆదేశాలతో జరిగిన విచారణ కమిటీ నివేదిక ఆధారంగా 8 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ సర్వీస్ వివరాలతో కూడిన లేఖను ఈ నెల 24వ తేదీన కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్కు పంపిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్(ఎల్టీపీ) కారణంగా కార్పొరేషన్కు ఆర్థిక నష్టం జరిగినట్లు నివేదికలో తెలిపారు. మొత్తం చెల్లించాల్సిన మొత్తం రూ.74.79 లక్షలు కాగా, అందులో రూ.68.65 లక్షలు దుర్వినియోగమయ్యాయి. ఇప్పటివరకు రూ.34.20 లక్షలు రికవరీ చేయగా, ఇంకా రూ.34.45 లక్షలు రికవరీ చేయాల్సి ఉందన్నారు.


