6 నుంచి విఘ్న విమోచక హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు విఘ్న విమోచక హనుమాన్ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో ఈ మహోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమాల్లో భాగంగా 5వ తేదీ సాయంత్రం విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షా బంధనం, అంకురారోపణ, 6వ తేదీ ఉదయం అరణిమథనం, అగ్ని ప్రతిష్ఠ, మన్యుసూక్త హవనం, పంచగవ్య శుద్ధి, పూర్ణాహుతి, అష్టోత్తర శత కలశాభి షేకం, సాయంత్రం అగ్నిముఖం, వాస్తు పూజ, హనుమద్వైభవ ప్రవచనం, పూర్ణాహుతి, 7వ తేదీ ఉదయం మన్యుసూక్త హవనం, మూలమంత్ర హవనం, పూర్ణాహుతి, అదే రోజు సాయంత్రం అగ్నిముఖం, తత్త్వన్యాస హోమం, పూర్ణాహుతి, సామూహిక హనుమద్ పూజ, ఈనెల 8వ తేదీ ఉదయం 10.55 గంటలకు విఘ్న విమోచక హనుమాన్ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం, మహాకుంభ సంప్రోక్షణ, ప్రథమారాధన, అనంతరం తీర్థప్రసాద గోష్ఠి, విశేష తదీయాధన కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 6 నుంచి 8వ తేదీ వరకు రోజూ సుందరకాండ పారాయణ, గోపూజ, హనుమాన్ చాలీసా పారాయణ, అఖండ హరేరామ నామ సంకీర్తన, హనుమద్ పూజలు, విశేష తదియారాధన జరుగుతాయని, భక్తులు పాల్గొని స్వామి వార్ల కృపకు పాత్రులు కాగలరని వారు కోరారు.


