గోవా పర్యాటక విధానం ఆదర్శం
బాపట్ల: జిల్లాలో తీర ప్రాంత పర్యాటక రంగ అభివృద్ధి లక్ష్యంగా మూడు రోజులపాటు గోవాలో అధ్యయన పర్యటన చేపట్టిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ బృందం శనివారం పర్యటనను ముగించింది. ఈ సందర్భంగా బృందం గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ను మర్యాదపూర్వకంగా కలిసింది. దేశంలో గోవాను ప్రముఖ పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దిన విధానంపై కలెక్టర్ బృందం హర్షం వ్యక్తం చేసింది. పర్యటన సందర్భంగా అక్కడి అధికారులు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యమంత్రిని సత్కరించి, శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని జ్ఞాపికగా అందజేసింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రూపొందించిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని ముఖ్యమంత్రికి అందించింది. గోవా పర్యాటక విధాన పుస్తకాన్ని కలెక్టర్ బృందానికి ముఖ్యమంత్రి అందించారు. సముద్ర తీర ప్రాంతాల అభివృద్ధిలో తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ముఖ్యమంత్రి సూచించారు. నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని, భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తవని పేర్కొన్నారు. గోవా పర్యటనలో పొందిన అనుభవాలను బాపట్ల తీర ప్రాంత అభివృద్ధిలో అమలు చేస్తామని కలెక్టర్ బృందం వెల్లడించింది. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ జి. రఘునాథ రెడ్డి, తహసీల్దార్ కె. గోపికృష్ణ, ఎంపీడీవో ఎం. రాజేష్ బాబు, జిల్లా పర్యాటక అధికారి అలీ అస్గర్ షేక్, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రాజెక్టు మేనేజర్లు శివ శరణ్, షేక్ సజిత్ పాల్గొన్నారు.


