
పేరేచర్ల జంక్షన్లో పోటెత్తిన జనం
తాడికొండ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు బుధవారం తాడికొండ నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. అభిమాన నేతకు పేరేచర్ల జంక్షన్లో వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. వైఎస్ జగన్ రాక నేపథ్యంలో పెద్ద ఎత్తున నాయకులు,కార్యకర్తలు అక్కడికి చేరుకొని సందడి చేశారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అక్కడకు చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు నుంచి బయటకు వచ్చి వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. యువకులు నినాదాలు చేస్తుండగా జనం కేరింతల నడుమ కాన్వాయ్ ముందుకు కదిలింది. అనంతరం మేడికొండూరు చేరుకున్న కాన్వాయ్కు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నాయకులను పలకరించిన వైఎస్ జగన్ ముందుకు సాగారు. జంగంగుంట్లపాలెం, పాలడుగు అడ్డరోడ్డు, కొర్రపాడు మీదుగా సత్తెనపల్లి నియోజకవర్గంలోకి అడుగు పెట్టారు. కార్యక్రమంలో నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు ముప్పాళ్ళ మనోహర్, మైనేని నాగమల్లేశ్వరరావు, తాళ్ళూరి వంశీకృష్ణ, మార్పుల శివరామిరెడ్డి, ఎంపీపీ మన్నవ స్వప్న, జెడ్పీటీసీ సభ్యులు కందుల సిద్ధయ్య, దాసరి కత్తిరేణమ్మ, రాష్ట్ర కార్యదర్శి షేక్ మస్తాన్, చిట్టా అంజిరెడ్డి , పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.