
డ్రోన్లు.. బారికేడ్లు
సత్తెనపల్లి: కూటమి నేతల దాడులు, పోలీసుల వేధింపుల కారణంగా మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల వచ్చారు. జగన్ రాకను తెలుసుకున్న పోలీసులు రెంటపాళ్ల వీధుల్లో బారికేడ్లు అడ్డుగా పెట్టి జనాన్ని రాకుండా అడ్డుకున్నారు. ఇళ్లపై ఒక కానిస్టేబుల్, వీఆర్ఏలను ఏర్పాటు చేశారు. ఎవరూ ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దంటూ హెచ్చరికలు చేశారు. మరోవైపు మృతుడు నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లు తమ బంధువులను రానివ్వాలని వేడుకున్నప్పటికీ పట్టించుకోలేదు. ఆధార్ కార్డులు చూపాలంటూ అనేక రకాల ఆంక్షలు పెట్టి పోలీసులు ఇబ్బందులకు గురి చేశారు. అయినప్పటికీ లెక్కచేయని జనం తమ అభిమానాన్ని చాటుకునేందుకు ఇళ్ల పైకి ఎక్కి జగన్మోహన్రెడ్డిని చూసి చేతులు ఊపుతూ స్వాగతం పలికారు. వారి అభిమానానికి ముగ్ధుడైన వైఎస్ జగన్ చిరునవ్వుతో అభివాదం చేశారు. వైఎస్ జగన్ కాన్వాయ్ రెంటపాళ్ల గ్రామానికి చేరుకోగానే పోలీసులు నాలుగు డ్రోన్లు ఎగురవేశారు.