
పంపకాల్లో తేడాతో టెండర్లు వాయిదా
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన అభివృద్ధి పనులకు ఈ నెల 18వ తేదీన టెండర్లు ప్రక్రియ జరగాల్సి ఉండగా ఇంజినీరింగ్ అధికారులు ఈ నెల 21వ తేదీకి వాయిదా వేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక టెండర్లన్నీ ఆయా కూటమి పార్టీలకి చెందిన కాంట్రాక్టర్లు మాత్రమే ఎక్కువ లాభాలు వచ్చేలా వేయాలని.. తక్కువ లాభాలు వచ్చే టెండర్లు మాత్రమే వేరే కాంట్రాక్టర్లు వేసుకోవాలని కొద్ది రోజులుగా కాంట్రాక్టర్ల సమావేశంలో హుకుం జారీ చేసిన విషయం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. టెండర్ల విషయంలో తాము అనుకునే కాంట్రాక్టర్ కాకుండా వేరే వాళ్లు పోటీ పడనున్నారనే సమాచారంతో కొంత మంది కూటమి పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు వెంటనే రంగంలోకి దిగారు. ఇంజినీరింగ్ఽ అధికారులను అడ్డం పెట్టుకుని బుధవారం 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన టెండర్లలో సుమారు రూ.30 కోట్ల మేరకు 15 పనులను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసేలా చేశారు. దీనిపై ఇంజినీరింగ్ సూపరింటెండెంట్ను వివరణ కోరగా.. కొన్ని టెండర్లకు ఎవరూ దాఖలు చేయకపోవడం కారణంగానే వాయిదా వేశామని చెప్పారు.
పోలీసుల పనితీరుపై అసహనం
గుంటూరు ఎడ్యుకేషన్: పోలీసుల పని తీరు ఆశించిన స్థాయిలో లేదని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మజుందార్ అసహనం వ్యక్తం చేశారు. కేసుల దర్యాప్తు ఆలస్యం అవుతోందని, నిందితులను అరెస్ట్ చేయకపోవడంతోపాటు సరైన సెక్షన్లు నమోదు చేయటం లేదని తమకు ఫిర్యాదులు అందాయన్నారు. వాటిపై విచారణ జరిపి, కమిషన్కు గల జ్యూడీషియల్ అధికారాలను ఉపయోగించుకుని సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకునేలా పోలీసు శాఖను ఆదేశిస్తామని చెప్పారు. బుధవారం గుంటూరు జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మహిళా జన్ సున్వాయ్’ కార్యక్రమంలో వివిధ సంఘటనలపై జాతీయ మహిళా కమిషన్కు అందించిన ఫిర్యాదులపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజతో కలిసి ఆమె విచారణ చేపట్టారు. తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలకు సంబంధించి ఫిర్యాదులపై విచారణ జరిపారు. జెడ్పీకి వచ్చిన అర్చనా మజుందార్కు జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పుష్పగుచ్ఛం అందించారు.
జిల్లా జైలు సందర్శన
నగరంపాలెం: గుంటూరు జిల్లా జైలును బుధవారం డాక్టర్ అర్చనా మజుందార్, రాయపాటి శైలజలు బుధవారం సందర్శించారు. మహిళా ఖైదీల నివాస విభాగం, వంటశాల, రేషన్ గోదాం, ఖైదీలకు ఇచ్చే ఆహార పదార్థాలను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడారు.
మహిళల రక్షణకు ప్రాధాన్యత
గుంటూరు వెస్ట్: మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మజుందార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జేసీ ఎ.భార్గవ్తేజ, జిల్లా ఎస్పీ సతీష్కుమార్, అధికారులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెల్ప్లైన్, మెయిల్ ద్వారా ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు.