ఆంక్షలతో జనం ఆకాంక్షలు అడ్డుకోలేరు | - | Sakshi
Sakshi News home page

ఆంక్షలతో జనం ఆకాంక్షలు అడ్డుకోలేరు

Jun 18 2025 3:39 AM | Updated on Jun 18 2025 9:18 AM

-

పోలీసులు అడిగిన సమాచారం ఇచ్చాం 

కావాలనే ఆంక్షలు విధించి అడ్డుకోవాలని చూస్తున్నారు

 ఆత్మహత్య చేసుకున్న వైఎస్సార్‌ సీపీ కార్యకర్త కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ పరామర్శిస్తారు 

అడ్డుకోవాలని పోలీసులపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెస్తోంది 

వైఎస్సార్‌ సీపీ నేతలు విడదల రజిని, కాసు మహేష్‌ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, గజ్జల సుధీర్‌ భార్గవ్‌ రెడ్డి

 వైఎస్‌ జగన్‌ పర్యటనకు భద్రత కల్పించాలని ఎస్పీని కోరిన నేతలు

ఎన్నికల ఫలితాలు వచ్చీ రాకముందే.. పచ్చమూకలు పేట్రేగిపోయారు.. ఇక మాకెవరు అడ్డంటూ ఇళ్లపైకి దొమ్మీలకు దిగారు. అడ్డొచ్చిన వారినందరినీ ఆడ,మగ తేడా చూడకుండా దుర్భాషలాడుతూ, ఇళ్లపైకి రాళ్లు రువ్వుతూ వికటాట్టహాసం చేశారు. అప్పటికే బైండోవరై స్టేషన్‌లో ఉన్న బాధితుడిపై అధికార దర్పం చూపుతూ.. బెదిరింపులకు పాల్పడ్డారు. పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు నేడు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ రానున్న నేపథ్యంలో పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి పెద్దలు కుట్రలకు దిగారు. చిత్రవిచిత్ర ఆంక్షలతో పర్యటనను అడ్డుకునేందుకు శతధా యత్నించారు. 

నరసరావుపేట రూరల్‌: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలకు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ ఆదరణను చూసి భయంతో కూటమి సర్కారు వణికిపోతోందని మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్‌ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌ సీపీ సత్తెనపల్లి ఇన్‌చార్జి గజ్జల సుధీర్‌ భార్గవ్‌రెడ్డిలు మండిపడ్డారు. పోలీసులు, కూటమి నేతల వేధింపులు తాళలేక గత ఏడాది జూన్‌ 6న ఆత్మహత్య చేసుకున్న వైఎస్సార్‌ సీపీ కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామానికి రానున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించి పోలీస్‌ భద్రత కల్పించాలని నాయకులు మంగళవారం జిల్లా ఎస్పీని కలిశారు. అనంతరం ఎస్పీ కార్యాలయం బయట మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటనలను అడ్డుకోవాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం అనుమతుల పేరుతో పోలీసుల ద్వారా ఆంక్షలు విధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ పెద్దను కోల్పోయి, బాధతో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెడుతుండటాన్ని కూడా రాజకీయ కోణంలో చూడటం దారుణమన్నారు.

ఆంక్షలతో జనం ఆకాంక్షలు అడ్డుకోలేరు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పొదిలి పర్యటన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఆందోళన మొదలైందని నేతలు పేర్కొన్నారు. ఆయన ప్రజా సమస్యల పరిష్కారం కోసం బయటకొస్తే ప్రభుత్వం రోజులు లెక్క పెట్టుకోవాల్సి వస్తుందనే భయం కనిపిస్తోందన్నారు. ఆ భయంతోనే పోలీసులు చిత్రవిచిత్రమైన ఆంక్షలు విధించి అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. దేశంలోనే మాస్‌ లీడర్‌లలో ఒకరైన వైఎస్‌ జగన్‌ వస్తుంటే, కేవలం 100 మందినే అనుమతిస్తామని పోలీసులు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. భద్రతా కారణాలను సాకుగా చూపించి ఆయన పర్యటన అడ్డుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. అయినప్పటికీ చట్టాన్ని గౌరవించే పార్టీగా ఇప్పటికే మూడుసార్లు అనుమతుల కోసం పోలీసులను కలవడం జరిగిందని, మళ్లీ ఈరోజు మరోసారి జిల్లా ఎస్పీని కలవడం జరిగిందన్నారు.

పోలీసులు బెదిరిస్తున్నారు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పర్యటనకు కార్లు, ఆటోలు పంపవద్దని ట్రావెల్స్‌ నిర్వాహకులకు ఫోన్‌లు చేసి పోలీసులు బెదిరిస్తున్నారు. సామన్య ప్రజలను, వైఎస్సార్‌ సీపీ క్యాడర్‌ను భయబ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించడం దారుణం.
– విడదల రజిని, మాజీ మంత్రి

పరామర్శించి తీరుతాం
మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటనకు అనుమతుల కోసం పలుమార్లు పోలీసులను కలిశాం. ఆంక్షలతో అనుమతులు ఇచ్చేవిధంగా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. వంద మందికే పోలీసులు అనుమతి ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది.
– కాసు మహేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, గురజాల

పల్నాడుకు రానివ్వకుండా అడ్డుకునే కుట్ర
జగనన్నను జిల్లాలోకి రానివ్వకుండా అడ్డుకునేందుకు పోలీసులతో చంద్రబాబు, లోకేష్‌లు కుట్రలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు రాష్ట్రంలో ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారో గుర్తుపెట్టుకోవాలి. వైఎస్‌ జగన్‌ ఎక్కడకు వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని అడ్డుకునేందుకే కుట్రలు పన్నుతున్నారు.
– డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నరసరావుపేట

ఆరునూరైనా పర్యటన ఆగదు
వైఎస్‌ జగన్‌ పర్యటనకు ప్రత్యేక వాహనాలు కేటాయించి కార్యకర్తలను తరలించబోమని, తాడేపల్లిలో బయల్దేరిన వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ ఎక్కడా ఆగకుండా నేరుగా నాగమల్లేశ్వరరావు ఇంటికే చేరుకుంటుందని ఎస్పీకి స్పష్టంగా చెప్పామని, అయినా అనుమతిచ్చేది లేనిదీ ఆలోచించి చెబుతామని ఎస్పీ తెలిపారన్నారు. పోలీసులు అనుమతిచ్చినా, ఇవ్వకపోయినా, ఆరునూరైనా వైఎస్‌ జగన్‌ పల్నాడు పర్యటన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎన్ని ఆంక్షలు విధించినా సరే.. వైఎస్‌ జగన్‌ రెంటపాళ్ల చేరుకుని నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని వారు స్పష్టం చేశారు.

అనుమతులు ఇవ్వకపోవడం దుర్మార్గం
రెడ్‌బుక్‌ పాలనకు బలైన మొదటి వ్యక్తి నాగమల్లేశ్వరరావు. ఎన్నికల ఫలితాల అనంతరం నాగమల్లేశ్వరరావును పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. గ్రామం విడిచి వెళ్లొద్దంటూ పోలీసులు భయబ్రాంతులకు గురిచేశారు. మనస్థాపానికి గురైన నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వస్తుంటే అడ్డుకోవడం దుర్మార్గం.
– డాక్టర్‌ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ సత్తెనపల్లి ఇన్‌చార్జి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement