
శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా దోహదం
ఏఎన్యూ: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో సోమవారం యోగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. వర్సిటీ మెయిన్ గేట్ నుంచి ఇండోర్ స్టేడియం వరకు జరిగిన ర్యాలీలో బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తి మాట్లాడుతూ యోగా వ్యక్తుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. వర్సిటీ వీసీ కె. గంగాధరరావు మాట్లాడుతూ యోగా మంచి ఆరోగ్యం, మానసిక పరిశుభ్రత, భావోద్వేగ స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో మనిషికి సహాయపడుతుందని చెప్పారు. వర్సిటీ రెక్టార్ రత్న షీలామణి మాట్లాడుతూ ఒక వ్యక్తిలో నైతిక విలువలు ఉన్నతస్థాయి చేరడంలో యోగా క్రియాశీల పాత్ర పోషిస్తుందని వివరించారు. వర్సిటీ రిజిస్ట్రార్ జి. సింహాచలం మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 18న వర్సిటీ ప్రధాన క్రీడా మైదానంలో సుమారు 10వేల మందితో వేడుకలు జరుగుతాయని వెల్లడించారు. వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ కోయంబత్తూర్ వర్సిటీ కో–ఆర్డినేటర్ ఏ. రాధిక వివిధ యోగా అంశాలలో శిక్షణ ఇచ్చారు.కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, యోగాంధ్ర నిర్వాహకులు పి.పి.ఎస్. పాల్ కుమార్, దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వెంకటేశ్వర్లు, పరీక్షల కో–ఆర్డినేటర్ రామచంద్రన్, రూసా డైరెక్టర్ ఎస్. మురళీమోహన్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ దివ్య తేజ మూర్తి, వసతి గృహాల చీప్ వార్డెన్లు మల్లికార్జున, మాధవీలతోపాటు వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్ వీరయ్య సురేష్ కుమార్, సిద్ధయ్య పాల్గొన్నారు.