భారతీయ జీవన దర్శనం మౌనాన్ని ఒక మహోన్నత తపస్సుగా, ముని వృత్తిగా అభివర్ణించింది. ‘మౌనం సర్వార్థ సాధకమ్‘ – అనగా మౌనం ద్వారా సమస్త కార్యాలను సాధించవచ్చు. మౌనం అంటే కేవలం పెదవులు మూసి ఉంచడం కాదు; అనవసర ఆలోచనలను నియంత్రించి మనసును నిశ్శబ్దంగా మార్చడం.
నేటి ఆధునిక కాలంలో మనిషి నిరంతరం బాహ్య ప్రపంచపు శబ్దాల మధ్య, సామాజిక మాధ్యమాల అలజడిలో జీవిస్తున్నాడు. ఈ గందరగోళం వల్ల తనతో తాను మాట్లాడుకునే అమూల్య సమయాన్ని కోల్పోతున్నాడు. మౌనం మనలో నిద్రాణమై ఉన్న సృజనాత్మకతను, వివేకాన్ని మేల్కొల్పుతుంది. మాటల ద్వారా వ్యయమయ్యే శక్తిని ఆదా చేసి, ఆ శక్తిని అంతరంగ వికాసానికి ఉపయోగించేలా చేస్తుంది.
వైదిక ఆధ్యాత్మిక చరిత్రలో మౌనానికి రమణ మహర్షి ఒక మహోన్నత నిదర్శనం. ఆయన కేవలం తన మౌనం ద్వారానే భక్తుల సంశయాలను నివృత్తి చేసేవారు. మాటలు వివరించలేని గూఢ సత్యాలను మౌనం సులువుగా వివరిస్తుంది. అలాగే, దక్షిణామూర్తి స్వరూపంలో పరమశివుడు మౌన ముద్ర ద్వారానే శిష్యులకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించినట్లు పురాణాలు ఘోషిస్తున్నాయి. అశాంతిగా ఉన్న మనసు ఎప్పుడూ వాదిస్తుంది; ప్రశాంతమైన చిత్తం మౌనంలో లీనమవుతుంది. మౌనం మనల్ని అహంకారం నుండి విముక్తులను చేసి, పరమాత్మతో అనుసంధానం చేస్తుంది. లోతైన నిశ్శబ్దంలోనే దైవ వాక్కు వినిపిస్తుంది. నిశ్చలత్వమే నిత్య సత్యమని గ్రహించినప్పుడే మానవుడు పరిపూర్ణుడు కాగలడు.
నిత్య జీవితంలోని ఆచరణాత్మక అంశాన్ని గమనిస్తే, మనం మాట్లాడే మాటల్లో చాలా వరకు అనవసరమైనవి, ఇతరులను నొప్పించేవి ఉంటాయి. మౌనాన్ని అలవర్చుకోవడం వల్ల వాక్ దోషాలు నశిస్తాయి. ఒక వివాదం తలెత్తినప్పుడు ఎదురు దాడి చేసే కంటే, కాసేపు మౌనంగా ఉండటం వల్ల ఆవేశం తగ్గి విచక్షణ పెరుగుతుంది. ప్రతిరోజూ కనీసం కొద్దిసేపైనా ఏకాంతంగా మౌనం పాటించడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. ఇది మన నరాల వ్యవస్థకు విశ్రాంతినిచ్చి, ఏకాగ్రతను పెంపొందిస్తుంది. మనం ఎంత తక్కువగా మాట్లాడితే మన మాటలకు అంతటి గౌరవం పెరుగుతుంది. మౌనం బలహీనత కాదు; అది ఒక ఉన్నతమైన మానసిక పరిపక్వత.
ఆర్ష సంస్కృతి అందించిన ఈ మౌన మార్గం వ్యక్తిని ప్రజ్ఞావంతుడిగా తీర్చిదిద్దుతుంది. మాటలు వెండి అయితే మౌనం బంగారం అన్న నానుడి అక్షర సత్యం. మన అంతరంగంలో మౌనం అనే జ్యోతి వెలుగుతున్నప్పుడు, బాహ్య ప్రపంచంలోని కల్లోలాలు మనల్ని స్పృశించలేవు. మాటలకందని ఆనందాన్ని అనుభవించాలంటే మౌనమే ఏకైక శరణ్యం. అశాంతిని వీడి, మౌనాన్ని ఆలింగనం చేసుకుని ఆత్మాన్వేషణ సాగిద్దాం. మౌనమే శక్తి, మౌనమే శాంతి. సర్వం నిశ్శబ్దమయం!
బాహ్య ప్రపంచంలో మనం ఎంత ఎదిగినా, అంతరంగంలో మౌనాన్ని ఆశ్రయించినప్పుడే పరిపూర్ణ శాంతి లభిస్తుంది. మౌనంలో మన బలహీనతలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి; వాటిని సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుంది. ఇది మనల్ని అంధకారం నుండి వెలుగు వైపు, అశాంతి నుండి ప్రశాంతత వైపు
నడిపించే దివ్య మార్గం.
– కె. భాస్కర్ గుప్తా
వ్యక్తిత్వ వికాస నిపుణులు


