'ఉగాది' అంతరార్ధం? ఆ కారణంగానే ఈ పండుగను.. | ugadi 2026: Ugadi 2026: Date, puja timings, rituals and significance ... | Sakshi
Sakshi News home page

'ఉగాది' అంతరార్ధం? ఆ కారణంగానే ఈ పండుగ జరుపుకుంటున్నామా?

Mar 19 2026 6:45 AM | Updated on Mar 19 2026 6:45 AM

భాషాపరంగా యుగాది సరైన పదం. ఉగాది అనే పదం వికృతిపదం. అయితే రెండూ ఒకే అర్థాన్ని బోధించే పదాలే. నిజానికి “యుగాది” అనే పదమే కాలాంతరంలో 'ఉగాది'గా మారింది. సోమకాసురుని నుండి వేదాలను విష్ణువు రక్షించిన రోజు ఉగాది. నూతన కల్పంలో జగత్తు సృష్టిని బ్రహ్మ ప్రారంభించిన రోజు. ఆరు రుచుల కలయికతో అనారోగ్యాలను అంతం చేసేది ఉగాది. హిందువుల పండుగల సంప్రదాయానికి మొదలు ఉగాది. 

వరాహమిహిరుడు ఈ ఉగాది నాడే పంచాంగాన్ని పరిచయం చేశాడని అంటారు. శ్రీరా ముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు మొదలైన వారు ఉగాదినాడే పట్టాభిషిక్తులైనారని ఆర్యులు చెబుతారు. సంవత్సరాది నాడు ప్రజలు తెల్లవారక ముందే నిద్ర లేచి, కాలకృ త్యాలు తీర్చుకొని, తలకు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి, ఇష్టదైవానికి పూజలు చేసి, షడ్రుచుల పచ్చడిని ఆరగించాలి. నిర్ణీత సమయంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం చేయాలి.

తిథిర్వారం చ నక్షత్రం యోగః కరణమేవ చ,
పంచాగస్య ఫలం శృణ్వన్ గంగాస్నాన ఫలం లభేత్.

తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే పంచాంగ శ్రవణం వల్ల గంగా స్నానంతో సమానంగా పుణ్యం, పురు షార్థం లభిస్తుందని పై శ్లోకం చెబుతున్న భావం. కొత్త సంవత్సరంలో గ్రహ, రాశిఫలాల్లో, నామ నక్షత్రాల్లో తేడా వస్తే దోషనివారణ కోసం శాంతి హోమాలు, వ్రతాలు, పూజలు చేసి సుఖశాంతులతో ప్రజలు జీవించడానికి పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. నవగ్రహాల్లో సూర్యుడు తేజస్సును, చంద్రుడు భోగభాగ్యాలను, కుజుడు శుభాలను, బుధుడు బుద్ధి వికాసాన్ని, గురుడు జ్ఞాన విత్తాన్ని, శుక్రుడు కార్యసిద్ధిని, శనీశ్వరుడు దుఖ వినాశాన్ని, రాహువు సంతోషకరమైన రాణింపును, కేతువు చెప్పుకోదగి నంత గొప్పదనాన్ని కలిగిస్తారని విద్వాంసులు చెబుతారు.

ఆరోగ్యమనే మహాభాగ్యాన్ని కలిగించేది ఉగాది పచ్చడి. శాస్త్రవచనాల్లో దానికి నింబకుసుమ భక్షణం, అశోకకళికా ప్రాశనం అనే పేర్లు కూడా ఉన్నాయి. తీపి, ఉప్పు, చేదు, వగరు, పులుపు, కారం సమపాళ్లలో కలిపి ఈ పచ్చడిని తయారు చేస్తారు. తీపికి బెల్లం, ఉప్పునకు ఉప్పు, చేదుకు వేపపూత, వగరుకు మామిడి ముక్కలు, పులుపునకు చింత పండు, కారమునకు మిరియాలు ఉగాది పచ్చడిలో వాడు తారు. 

వీటికి తోడు తమతమ ఇష్టాలను బట్టి జీలకర్ర, అరటిపండ్లు, ఎండుద్రాక్ష, జీడిపప్పు వంటివి కూడా కలిపి గొప్ప ఔషధంగా ఆరగిస్తారు. ఈ పచ్చడిని చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు ఒక పక్షం రోజులు సేవిస్తే వాత, పిత్త, కఫములకు చెందిన రోగాలన్నీ పటాపంచలవుతాయని వైద్యశాస్త్రం చెబుతుంది. భారతదేశంలో ఆంధ్ర రాష్టేతరులు సైతం సంవత్సరాది ఉత్సవాలను జరుపుకుంటారు. తమిళులు, మళయాళీలు, మరాఠీలు, సిక్కులు ఈ పండుగను జరుపుకోవడం విశేషం.

(చదవండి: ఉగాది పండుగ నాడు తప్పక ఆచరించాల్సినవి...!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement