అరుదైన శిల్పం
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో వెలసిన చారిత్రాత్మక అవినాశిలింగేశ్వర ఆలయం అవినాశి అప్పర్ ఆలయం అని కూడా పిలువబడుతుంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న అద్భుతమైన శిల్పం 63 మంది శైవ నాయనార్లలో ఒకరైన సుందరమూర్తి నాయనార్ జీవితంలో జరిగిన అత్యంత ప్రసిద్ధమైన పౌరాణిక అద్భుతాన్ని కళ్లకు కడుతుంది.
సుందరార్ శివభక్తులలో అగ్రగణ్యుడు, తేవారం అనే పవిత్ర తమిళ శైవ కీర్తనల సంకలన కర్త. ఈ శిల్పఘట్టాన్ని తమిళంలో ముదలై వాయి పిళ్ళై అని పిలుస్తారు, మొసలి నోటిలోని బాలుడని దీని అర్థం. ఎనిమిదవ శతాబ్దంలో సుందరార్ అవినాశి గ్రామం గుండా వెళ్తుండగా ఒకే వీధిలోని రెండు ఇళ్లలో పరస్పర విరుద్ధమైన వాతావరణాన్ని గమనించారు. ఒక ఇంట్లో ఒక బాలుడికి ఎంతో వైభవంగా ఉపనయన వేడుక జరుగుతుండగా ఎదురింట్లో ఉన్న తల్లిదండ్రులు మాత్రం తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు. దాని వెనుక ఉన్న కారణాన్ని విచారించగా 3 ఏండ్లక్రితం ఆ ఇద్దరు బాలురు స్థానిక తామరై కుళం అనే తామరచెరువులో స్నానానికి వెళ్లినప్పుడు ఒక బాలుడిని పెద్ద మొసలి మింగేసింది.
ఈ రోజు బతికి ఉన్న బాలుడి ఉపనయన వేడుకలు చూసి తమ కొడుకు కూడా ఉంటే ఇలాగే వేడుక చేసుకునేవారమని ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఆ తల్లిదండ్రులు అనుభవిస్తున్న అపారమైన వేదనను, దు:ఖాన్ని చూసి సుందరార్ హృదయం ద్రవించిపోయింది. వెంటనే ఆయన ఆ చెరువు ఒడ్డుకు చేరుకుని అవినాశిలింగేశ్వరుడిని అంటే పరమశివుడిని సంపూర్ణ భక్తితో ధ్యానిస్తూ పది పవిత్ర తమిళ శ్లోకాలతో కూడిన ఎట్రానై మరక్కేనే అనే ప్రసిద్ధ దేవార పదిగమ్ను ఆలపించారు.
ఇలా భక్తి పారవశ్యంలో ఆలపించిన కీర్తనల ద్వారానే శివుడిని మెప్పించి అద్భుతాలు సాధించడం నాయనార్ల చరిత్రలో పలుమార్లు కనిపించే ఒక విశిష్టలక్షణం. సుందరార్ అనన్య భక్తికి ఆర్తికి మెచ్చిన పరమశివుడు ప్రదర్శించాడు. సుందరార్ ప్రార్థన పూర్తికాగానే ఎండిపోయిన ఆ చెరువులోకి నీరు అమాంతంగా ప్రవహించడం ప్రారంభమై నిండింది.
ఆ చెరువులో నుండి ఒక పెద్ద మొసలి పైకి తేలింది. యమధర్మరాజు స్వయంగా ఆ బాలుడి ఆత్మను తిరిగి ప్రవేశపెట్టగా ఆ మెుసలి తన నోటి నుండి ఆ బాలుడిని సురక్షితంగా బయటకు పడవేసింది. కాలం గడిచినా శివానుగ్రహంతో ఆ బాలుడు చనిపోకుండా సరిగ్గా ఉపనయన వయస్సున్న 8 ఏళ్ల బాలుడిగా ఎటువంటి గాయాలు లేకుండా నమస్కరిస్తూ బయటకు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ శిల్పంలో ముసలి నోటి నుండి బాలుడు ప్రాణాలతో సురక్షితంగా బయటకు వస్తున్న భక్తిరస పూరిత అద్భుత దృశ్యాన్ని నాటి శిల్పులు అత్యంత నైపుణ్యంతో చెక్కారు. శైవ సిద్ధాంతంలో భక్తికి శక్తికి భగవంతుని అపరిమిత కరుణకు ఈ సంఘటన ఒక నిదర్శనంగా నిలిచింది. ఈ కథ తమిళ శైవసాహిత్యంలో పెరియపురాణం అనే గ్రంథంలో కూడా ప్రస్తావించబడింది. ఇది నాయనార్ల జీవిత చరిత్రలను వర్ణించే ప్రామాణిక కావ్యం. ఈ నాటికీ అవినాశిలింగేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం పంగుణి అశ్విని నక్షత్రం రోజున ఈ ముదలై వాయి పిళ్ళై అద్భుతాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. భక్తులు విశేషంగా పాల్గొంటారు.
– జి.బి. విశ్వనాథ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్
ఇవి కూడా చదవండి: విద్యార్థిని తీర్చిదిద్దే అసలైన శిల్పి గురువే!


