5 పైసలు..5 లక్షల ఖర్చు | Delhi Bus Conductor Sacked Over 5 Paisa, Legal Battle On For 40 Years | Sakshi
Sakshi News home page

5 పైసలు..5 లక్షల ఖర్చు

Mar 22 2026 12:39 AM | Updated on Mar 22 2026 12:59 AM

Delhi Bus Conductor Sacked Over 5 Paisa, Legal Battle On For 40 Years

సంస్థ సొమ్మును కాజేయాలని చూసిన ఉద్యోగికి శిక్ష పడాల్సిందేనని కార్పొరేషన్, ‘నేను ఏ తప్పు చేయలేదు.. నాకు న్యాయం చేయండని’ ఆ ఉద్యోగి... 40 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగారు. కేసు కోసం లక్షలు ఖర్చు చేశారు.. సంస్థ ఏళ్ల తరబడి పోరాడిందంటే ఆ ఉద్యోగి భారీగానే ‘ నొక్కేసుంటాడు’, అవినీతి సొమ్ము ‘మెక్కేసుంటాడని’ అనుకుంటున్నారా.. అయితే మీరు ‘చిల్లర’లో కాలేసినట్టే... ఎందుకంటే ఆ ఉద్యోగి సంస్థకు చెందాల్సిన ‘5పైసలు’ తన జేబులో వేసుకున్నాడని సంస్థ ఆరోపణ. అవును మీరు చదివింది నిజమే ‘5 పైసలే’. భారత న్యాయవ్యవస్థలో  ‘5 పైసల కేసు’గా గుర్తింపు పొందింది. అసలేం జరిగింది.. చివరికి ఎవరికి న్యాయం దక్కిందో తెలుసుకుందాం..

ఇప్పుడంటే యూపీఐ పేమెంట్‌లు, కార్డులతో చెల్లింపులు వచ్చాయి.. కానీ ఒకప్పుడు బస్సుల్లో ‘చిల్లర పోరాటాలు’ సర్వసాధారణం. ‘టికెట్‌కు సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్‌కు సహకరించండి’ అని బస్సుల్లో రాసేవారు. చిల్లర ఇవ్వకుండా కండక్టర్‌ ‘నొక్కేశాడని’ ప్రయాణికుల నుంచి  ఆరోపణలు వినిపించేవి. ఢిల్లీకి చెందిన రణవీర్‌ సింగ్‌ యాదవ్‌  ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌(డీటీసీ)లో కండక్టర్‌గా పనిచేసేవాడు. 1973లో ఆయన డ్యూటీలో ఉండగా స్క్వాడ్‌ బస్సును ఆపి తనిఖీ చేసింది. ఓ ప్రయాణికురాలి దగ్గర నుంచి 15 పైసలు తీసుకుని, ఆమెకు పది పైసల టికెట్‌ ఇచ్చాడు. మిగిలిన 5 పైసలు అతను జేబులో వేసుకున్నాడని స్క్వాడ్‌ ఆరోపణ. విచారణ జరిపి డీటీసీ 1976లో అతడ్ని విధుల నుంచి తొలగించింది. 

కోర్టులో పోరాటం
తనను అన్యాయంగా సస్పెండ్‌ చేశారంటూ రణవీర్‌సింగ్‌ లేబర్‌ కోర్టును ఆశ్రయించారు. తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు.  కేవలం ‘5 పైసల’ విషయంలో ఒక ఉద్యోగిని విధుల నుంచి తొలగించడం చాలా కఠినమైన శిక్ష అని కోర్టు పేర్కొంది. గతంలోనూ అతను విధుల్లో నిర్లక్ష్యం వహించాడన్న  డీటీసీ వాదనల్ని కోర్టు తోసి పుచ్చింది. అతడికి తిరిగి ఉద్యోగం ఇవ్వాలని  1990లో  తీర్పు ఇచ్చింది. 

హైకోర్టులో అప్పీలు
లేబర్‌ కోర్టు తీర్పును డీటీసీ ఢిల్లీ హైకోర్టులో 1991లో సవాలు చేసింది. అప్పటి నుంచి ఏళ్ల పాటు ఈ కేసు కొనసాగింది. చివరికి ఢిల్లీ హైకోర్టు డీటీసీ పిటిషన్‌ను కొట్టేసింది. అతనికి రావాల్సిన గ్రాట్యూటీ, కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్‌ ఫండ్‌ చెల్లించాలని ఆదేశించింది. ‘ 5 పైసల’ కోసం ఇన్నేళ్లు కేసు నడపడానికి ఎంత ఖర్చు చేశారని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించగా, ఇరు పక్షాలు కలిపి సుమారుగా రూ. 5 లక్షల వరకు ఖర్చు చేసినట్టు వెల్లడైంది. కేసు గెలవాలి.. తను నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని  బాధితుడు తన ఆస్తిని అమ్మేశాడు. కష్టపడి కూడగట్టుకున్న పొదుపు సొమ్మును ఖర్చు చేశాడు..డీటీసీ ‘5పైసల’ కోసం సుమారుగా రూ. 47,000 కోర్టు ఖర్చుల నిమిత్తం ఖర్చు పెట్టింది. 

ఒక చిన్న వివాదం కోర్టుల్లో ఏళ్ల తరబడి ఎలా సాగుతోంది..ఓ వ్యక్తి న్యాయపోరాటం అతని జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..  ఈ తరహా చిన్న ఘటనలు కోర్టు విలువైన సమయాన్ని వృథా  చేస్తాయనే దానికి ఈ కేసు ఓ ఉదాహరణ.
 

‘నేను మోసం చేశానా అని నా పిల్లలు కూడా అడిగేవారు.  నేను తప్పు చేయలేదని వారికి చెప్పడం చాలా బాధగా ఉండేది’..  
నేను తప్పుచేయలేదని నిరూపించుకోవడానికి నా జీవిత కాలం చేసిన పొదుపు మొత్తం ఖర్చు చేయాల్సి వచ్చింది.
‘ నా వయస్సు వారు  తీర్థయాత్రలకు వెళ్లేవారు... నేను మాత్రం ఏళ్ల తరబడి కోర్టుల యాత్ర’ చేశాను.  
– రణవీర్‌సింగ్‌ యాదవ్, బాధితుడు

Advertisement
 
Advertisement
Advertisement